బంగ్లాదేశ్ ఎంపీ కోల్‌కతాలో దారుణ హత్య

చికిత్స కోసం భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్ (55) అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. కోల్‌కతాలో రెండు రోజుల కిందట కనిపించకుండా పోయిన ఆయన ఓ చోట శవమై తేలారు. మే 12న కోల్‌కతాకు వచ్చిన బంగ్లాదేశ్ అధికార అవామీ లీగ్ పార్టీ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్.. తన స్నేహితుడు గోపాల్ దాస్ నివాసంలో ఉన్నారు.
 
 కానీ, రెండు రోజుల కిందట ఆయన అదృశ్యం కావడంతో ఆందోళనకు గురైన గోపాల్ బిస్వాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగ్లాదేశ్‌లోని అన్వర్ కుటుంబసభ్యులు కూడా తమ ప్రధాని షేక్ హసీనా దృష్టికి తీసుకెళ్లారు. దీంత భారత్‌లోని బంగ్లాదేశ్ దౌత్యవేత్తలకు ప్రధాని కార్యాలయం సమాచారం ఇచ్చింది.
 
గోపాల్ దాస్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన బెంగాల్ పోలీసులు.. ఆయన కోసం గాలించారు. ఆయనను ఫోన్‌లో సంప్రదించడానికి ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో కోల్‌కతాలోని న్యూటౌన్ ప్రాంతంలో ఓ మృతదేహాన్ని గుర్తించారు. 
 
ముక్కలుగా ఉన్న మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. హత్య చేసి మృతదేహాన్ని న్యూటౌన్ ప్రాంతంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  ఎంపీ ప్రయాణించిన కారును న్యూటౌన్‌లోని ఆక్వాటికా సమీపంలో బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు గోపాల్ బిస్వాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘అన్వరుల్ అజీమ్‌ కుటుంబంతో మాకు 25 ఏళ్లుగా అనుబంధం ఉంది.. అజీమ్ మే 12 రాత్రి 7 గంటలకు మా ఇంటికి వచ్చాడు.
మర్నాడు మధ్యాహ్నం 1:41 గంటలకు డాక్టర్ అపాయింట్‌మెంట్ ఉందని బయటకువెళ్లి సాయంత్రం తిరిగి వస్తానని చెప్పారు.. బిధాన్‌పార్క్- కలకత్తా పబ్లిక్ స్కూల్ వద్దకు కారులో బయలుదేరారు. సాయంత్రం తిరిగి రాకపోవడంతో ప్రత్యేక పనిపై ఢిల్లీ వెళ్లినట్లు వాట్సాప్‌లో సందేశం పంపాడు. రాగానే ఫోన్ చేస్తానని చెప్పాడు. మే 16 నుంచి ఫోన్‌లో సంప్రదించడానికి ప్రయత్నించినా ఎటువంటి స్పందన రాలేదు.’ అని మే 18న బారానగర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.
 
కోల్‌క‌తాలోని ఫ్లాట్‌లో అత‌న్ని హత్యా చేసిన‌ట్లు బాంగ్లాదేశ్ లో ఆ దేశ హోంమంత్రి అస‌దుజ్జ‌మాన్ ఖాన్ ప్రకటించారు. ఈ హ‌త్య కేసుతో సంబంధమున్న ముగ్గురు వ్య‌క్తుల‌ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎంపీ అన్వ‌రుల్‌ను హ‌త్య చేసిన ముగ్గురూ బంగ్లాదేశీలు అని, చాలా ప్లాన్ ప్రకారం మ‌ర్డ‌ర్ జ‌రిగింద‌ని మంత్రి వెల్ల‌డించారు. 
 
అయితే ఎంపీ అన్వ‌రుల్ మృత‌దేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉంద‌ని పేర్కొన్నారు. ఏ కార‌ణం చేత అత‌న్ని హ‌త్య చేశారో తెలియ‌ద‌ని, ఆ విష‌యాన్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. జెనాయిదా-4 నియోజ‌క‌వ‌ర్గం నుంచి అజిమ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మూడు పర్యాయాలు ఎంపీగా గెలుపొందారు. జెనాయిదా సరిహద్దు ప్రాంతం. అక్క‌డ క్రైం రేట్ ఎక్కువ‌గా ఉంటుంది. అన్వ‌రుల్ మృతి ప‌ట్ల ప్ర‌ధాని షేక్ హ‌సీనా తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.