
ఉక్కపోత, వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈనెల 19వ తేదీకల్లా దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది.
దక్షిణ కర్ణాటక నుంచి వాయవ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణశాఖ తెలిపింది.
మంగళవారం వడగాలుల ప్రభావం ఉండదని, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
అదే విధంగా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేస్తోంది. ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, సత్యసాయి, బాపట్ల, అనకాపల్లి, కాకినాడ, నంద్యాల తదితర జిల్లాల్లో సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లా బల్లిపల్లిలో 79 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల ప్రభావంతో ప్రజలకు వడగాలుల నుంచి ఉపశమనం లభించింది.
అదే విధంగా సోమవారం ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల క్రితం వరకు గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 47డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చి నెలలోనే వాతావరణం మారిపోయింది. మార్చి చివరి వారం ఏప్రిల్ నెలలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోత, వడగాలులతో జనం ఉక్కిరి బిక్కిరయ్యారు.
More Stories
ఫైళ్లను పట్టించుకోని చంద్రబాబు, ఆయన మంత్రులు
తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు
గిరిజన చట్టాలు సవరించాలన్న స్పీకర్ వ్యాఖ్యలపై అభ్యంతరం