భూమిని కబ్జా చేసేందుకు యత్నించారనే ఆరోపణలపై ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాంతో పాటు ఆయన కుటుంబసభ్యులపై శ్రీకాకుళం పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 13 మంది మీద శ్రీకాకుళం రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ 13 మందిలో ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం శ్రీకాకుళంలోని బలగ పరిధిలో ఉన్న 35/13 సర్వే నంబర్లోని భూమిని కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నించారు. ఈ భూమి విలువ మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకూ ఉంటుంది. అయితే 1992 నుంచి 1998 సంవత్సరం మధ్య ఈ భూమికి సంబంధించి కొన్ని అమ్మకాల లావాదేవీలు జరిగాయి. ఇదంతా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023లో ఆయన స్పీకర్గా ఉన్నప్పుడే జరిగింది. ఇటీవల బాధితుడి ఫిర్యాదుతో కబ్జా బాగోతం వెలుగులోకి వచ్చింది.
ఈ క్రమంలోనే భూమి అసలు యజమాని అయిన అంధవరపు గోవిందరాజులు అనే వ్యక్తి బతికి ఉండగానే చనిపోయినట్లు తప్పుడు డెత్ సర్టిఫికేట్ సృష్టించారు. ఈ డెత్ సర్టిఫికేట్ సాయంతో ఒడిశాకు చెందిన అడబాల రజనీ అనే మహిళను అంధవరపు గోవిందరాజులు కుమార్తె అంధవరపు రజనీగా పేర్కొంటూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తయారు చేశారు.
ఆ తర్వాత ఈ భూమిని తమ్మినేని సీతారాం తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం ఈ భూమి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించే ప్రయత్నం చేపట్టగా అసలు యజమాని కుటుంబం అడ్డుపడింది. ఆ తర్వాత గోవిందరాజులు అల్లుడు కనకలింగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
నకిలీ పత్రాలు సృష్టించడంతో పాటుగా తప్పుడు వారసత్వం, తప్పుడు రిజిష్ట్రేషన్ అంశాలు బయటపడ్డాయి. ఈ భూ కబ్జాకు యత్నించిన ఘటనలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ మీద కేసు నమోదైంది. అలాగే ఈ వ్యవహారం వెనుక ప్రస్తుతం హిరమండలం సబ్రిజిస్ట్రార్గా ఉన్న బొడ్డేపల్లి అరుణ కూడా ఉన్నట్లు గుర్తించామని శ్రీకాకుళం ఎస్పీ తెలిపారు.
ఈ కేసులో ఏ1గా ఉన్న అడబాల రజనీ, ఏ2 తెలుగు సతీష్ కుమార్ సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో ఏ5గా ఉన్న తమ్మినేని చిరంజీవి నాగ్, ఏ6 తమ్మినేని సీతారాం, ఏ7 తమ్మినేని వాణి, ఏ13 అరుణలపై దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు.

More Stories
నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1
ఏపీలో 12 కరోనా కేసులు.. ఆందోళన అవసరం లేదన్న మంత్రి
అమరావతిలో తొలిసారి జగన్నాథ రథయాత్ర