
ఈ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లు సాధింపబోతున్నట్లు టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఈ కూటమి విజయం సాధింపబోతున్నట్లు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు వారణాసికి చేరుకున్న ఆయన 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారని తెలిపారు. ప్రపంచంలో మన దేశం రానున్న రోజులలో కీలకపాత్ర పోషించబోతున్నట్లు చెప్పారు.
‘రాష్ట్రంలో ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది.ప్రపంచంలోనే భారతదేశం కీలక పాత్ర పోషించబోతుంది. 2047కు వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ కృషి చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయి.’ అని తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో 121 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రాంతాల వారీగా జరిగిన సంఘటనల వివరాలను ఫొటోలతో సహా చూపుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన 15 పేజీల లేఖలు రాశారు.
ఈ లేఖను పార్టీ జాతీయ ఎన్నికల సమన్వయకర్త కనకమేడల రవీంద్రకుమార్ ఢిల్లీలోని నిర్వాచన్ సదన్లో ఎన్నికల కమిషన్ అధికారులకు అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో అనేక నియోజకవర్గాల్లో మునుపెన్నడూ లేనంత హింసాత్మక ఘటనలు జరిగాయని, బలగాలను మోహరించడంలో పోలీసులు విఫలం కావడమే ఇందుకు ప్రధాన కారణమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
పోలింగ్ అనంతరం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో విలేకరులతో మాట్లాడిన చంద్రబాబు వైఎస్సార్సీపీ కుట్రల్ని ప్రజల సహకారంతో టీడీపీ శ్రేణులు ఎక్కడిక్కడ భగ్నం చేశాయని చెప్పారు. యువత, మహిళలు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల్లోనూ ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత పెల్లుబికిందని పేర్కొన్నారు. ఓటుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు చూడబోతున్నామని తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అని ఓటు వేయడానికి ప్రజలు చూపించిన ఉత్సాహం, వారిలో వెల్లివిరిసిన చైతన్యం చూసాక కొత్త చరిత్రకు ఇది శ్రీకారం అనిపించిందని కొనియడారు. అరాచకానికి ముగింపు పలికి ప్రజాస్వామ్య పాలన సాధించుకోవాలనే కసి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ప్రతి ఓటరు లోనూ స్పష్టంగా కనిపించిందని చెప్పారు.
ఒకే రకమైన సంకల్పంతో ఓటు వేయడానికి వందల, వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చారని, ఆర్థిక భారాన్ని, ఎండ వేడిమిని, ప్రయాణ కష్టాన్ని ఓర్చుకుని రాష్ట్రం కోసం పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన ప్రతి ఓటరుకు అధినేత హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.
More Stories
ఏపీలో శ్రీకాకుళంలో కొత్తగా ఎయిర్ పోర్ట్
తిరుమలలో హిందువులు మాత్రమే పనిచేయాలి
అసెంబ్లీకి దొంగల్లా వచ్చి వెళ్లడం ఏంటి?