సంక్షేమ పథకాల నగదు బదిలీ ఎన్నికలయ్యే వరకూ వాయిదా

ఏపీలో వివిధ సంక్షేమ పథకాల నగదు బదిలీని ఎన్నికలయ్యే వరకూ వాయిదా వేస్తూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బటన్ నొక్కిన ఆరు పథకాల డబ్బులు ఎన్నికల ముందు జమ చేసేందుకు వీల్లేదని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ కంటే ముందే వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ అయితే నొక్కారు  గాని, నగదు బదిలీ మాత్రం చేయలేదు.

ఆ పథకాల నిధులు ఎన్నికల ముందు బదిలీ చేసేవిధంగా ప్రణాళికలు వేసుకున్నారు.  అయితే ప్రస్తుతం ఆయా పథకాలకు చెందిన నిధులు ఎన్నికలు పూర్తి అయ్యాకే లబ్దిదారులకు నగదు  జమ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పథకాలకు సంబంధించి రూ. 14,165 కోట్లను ఎన్నికలకు ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని వైఎస్సార్సీపీ భావించింది.

ఎన్నికల కోడ్ రాకముందే బటన్ నొక్కి విడుదల చేసిన ఈ పథకాలకు నిధులు జమ కాకపోవటంపై ఈసీ విస్మయాన్ని వ్యక్తం చేసింది. నిధులు జమ ఎందుకు ఆలస్యమైందో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించింది. డీబీటీతో వెంటనే జమ అవుతున్నా ఎందుకు ఆలస్యమైందన్న ఈసీ, ప్రచారం ముగిశాక నిధులు జమ చేసే యత్నం జరుగుతోందని తెలిపింది. 

 
ఎన్నికల కోడ్ కంటే ముందుగానే నిధులు విడుదల చేసినా లబ్దిదారుల ఖాతాలకు వెళ్లకపోవడానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. మొత్తం ఆరు పథకాలకు ఎప్పుడెప్పుడు బటన్ నొక్కారనే అంశంపై జాబితాను విడుదల చేసింది. బ్యాంకు ఖాతాల ద్వారా జమ చేసే డీబీటీ నిధులు 48 గంటల్లోగా లబ్దిదారులకు వెళ్లకపోవటంపై విస్మయం వ్యక్తం చేసింది.

ప్రచారం పూర్తైన తర్వాత పోలింగ్ ముందు 11, 12వ తేదీల్లో నిధుల విడుదలయ్యేలా ప్రయత్నాలు జరిగాయన్న సమచారం తమకు ఉందని ఈసీ పేర్కొంది. పోలింగ్‌కు 2 రోజుల ముందు జమ చేస్తే కోడ్‌ ఉల్లంఘనే అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎన్నికలు పూర్తయ్యాకే లబ్దిదారుల ఖాతాలలో జమ చేయాలని తేల్చి చెప్పింది. మే 13న పోలింగ్ పూర్తి అయ్యాక ఈ మొత్తాన్ని లబ్దిదారుల ఖాతాలకు జమ చేసేలా మార్గదర్శకాలు ఇస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.