విజయవాడలో ప్రధాని రోడ్ షో- బ్రహ్మరథం పట్టిన ప్రజలు

విజయవాడ మోదీ నామస్మరణతో మారుమోగిపోయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధానికి అశేష జనవాహిని ఘన స్వాగతం పలికింది. విజయవాడ బందర్‌రోడ్డులోని మున్సిపల్ స్టేడియం నుంచి భారత ప్రధాని ప్రచారం వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేసుకుంటూ రోడ్‌షో నిర్వహించారు. 

ప్రధానితోపాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్‌కల్యాణ్‌ సైతం రోడ్‌షోలో పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ప్రధాని మోదీ ముందుకు సాగారు. అంతకు ముంది అన్నమయ్య జిల్లా కలికిరి కూటమి సభలో పాల్గొన్న ప్రధాని మోదీ, గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. 

మోదీకి 14 మంది కూటమి పార్టీల ప్రతినిధులు స్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో ఇందిరాగాంధీ స్టేడియం వద్దకు బయలుదేరారు అనంతరం స్టేడియం వద్ద మోదీకి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ స్వాగతం పలికారు. సాయంత్ర 7 నుంచి 8 వరకు ప్రధాని నేతృత్వంలో బందరు రోడ్డులో రోడ్‌ షో జరిగింది. మెుత్తం 1.8 కి.మీ. రోడ్‌ షోలో మోదీ పాల్గొన్నారు.

ఈ రోడ్ షో పై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. విజయవాడలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో కలిసి మరపురాని రోడ్‌షో పాల్గొన్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.  గత కొన్ని రోజులుగా ఏపీ అంతటా పర్యటించిన తర్వాత, ప్రజలు పెద్ద సంఖ్యలో ఎన్డీఏకి ఓటు వేస్తున్నారని నేను నమ్ముతున్నానని భరోసా వ్యక్తం చేశారు. మహిళలు, యువ ఓటర్ల మద్దతు తమకు ఉందని తెలిపారు.

ఏపీలో గతంలో బీజేపీ, టీడీపీతో కలిసి పనిచేశామని ప్రధాని మోదీ గుర్తు చేశారు. తమది బలమైన కూటమి, భవిష్యత్తు అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.  ఈ క్రియాశీల భాగస్వామ్యాన్ని జనసేన పార్టీ మరింత బలోపేతం చేసిందని చెప్పారు. ఈ కూటమికి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగల సత్తా ఉందని ధీమా వ్యక్తం చేశారు

ప్రధానితో పాటుగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ రోడ్డు షోలో పాల్గొన్నారు. కూటమి రోడ్డు షో చూడటానికి మూడు పార్టీల అభిమానులు బందరు రోడ్డుకు భారీగా తరలివచ్చారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ, చంద్రబాబు, పవన్ ముందుకు సాగారు.

మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ఒకే వాహనంపై రోడ్‌ షో నిర్వహించారు. మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్‌ షోపై రాజధాని రైతుల హర్షం వ్యక్తం చేశారు. కూటమికి మద్ధతు తెలపడానకి రాజధాని రైతులు, మహిళలు బెంజ్ సర్కిల్ వద్దకు పెద్దసంఖ్యలో వచ్చారు. కూటమి గెలుపుతోనే అమరావతికి, ఏపీకి న్యాయం జరుగుతుందని రాజధాని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.

 రోడ్డు షో సందర్భంగా కూటమి పార్టీల కార్యకర్తలు, అభిమానులతో బందర్ రోడ్డు రద్దీగా మారింది. సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమై రోడ్డు షో గంటపాటు సాగింది. రోడ్ షోలో కూటమి లోక్‌సభ, శాసనసభ అభ్యర్థులు సైతం పాల్గొన్నారు. రోడ్‌షో ముగిశాక గ్రీన్‌రూమ్‌లో మోదీ, చంద్రబాబు, పవన్‌ ఏకాంతగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో కూటమి జోష్ పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రోడ్ షో విజయవంతమైందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం, తాజా పరిస్థితులపై నేతలు చర్చించుకున్నారు.

తమకు ఉన్న నివేదికల ప్రకారం ఏపీలో కూటమి అధికారం ఖాయమని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లతో మోదీ చెప్పినట్లు సమాచారం అందుతోంది. ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు కూటమి గెలుస్తుందని మోదీ చెప్పినట్లు కూటమి నేతలు పేర్కొన్నారు. ప్రజలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర అగ్రహంతో, అసంతృప్తితో ఉన్నారన్న చెప్పినట్లు తెలుస్తోంది.