14 ఉత్పత్తుల పతంజలి లైసెన్స్‌ రద్దు

ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలికి మరో షాక్‌ తగిలింది. పతంజలికి చెందిన సుమారు 14 ఉత్పత్తుల తయారీ లైసెన్స్‌ను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రద్దుచేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర డ్రగ్స్‌ లైసెన్సింగ్‌ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుదోవ పట్టించే విధంగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారని నిర్ధారణ కావడంతో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

వాణిజ్య ప్రకటన విషయంలో ‘డ్రగ్స్‌ అండ్‌ మ్యాజిక్‌ రెమిడీస్‌ యాక్ట్‌’, ‘డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్‌ యాక్ట్‌’ను పతంజలి ఉల్లంఘించినట్లు అథారిటీ నిర్థారించింది. ఉత్పత్తులకు సంబంధించి ప్రచారం చేసిన ప్రయోజనాలపై ఆధారాలను సమర్పించడంలో విఫలమైనట్లు తెలిపింది. అలాగే తమ వాదనను సమర్థించుకుంటూ ఇచ్చిన సమాధానం కూడా సంతృప్తికరంగా లేదని స్పష్టం చేసింది.

పతంజలి ఆయుర్వేద దివ్య ఫార్మసీ రూపొందించిన దృష్టి ఐ డ్రాప్, స్వసరి గోల్డ్, స్వసరి వాటి, బ్రొన్‌కమ్, స్వసరి ప్రవాహి, స్వసరి అవాలెహ్, ముక్తా వాటి ఎక్స్‌ట్రా పవర్, లిపిడామ్, బీపీ గ్రిట్, మధుగ్రిట్, మధునషిని వాటి ఎక్స్ ట్రా పవర్, లివమ్రిత్ అడ్వాన్స్, లివొగ్రిట్, ఐగ్రిట్ గోల్డ్ ఉత్పత్తులను లైసెన్స్ విభాగం సస్పెండ్ చేసింది. 

ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఉత్తరాఖండ్ స్టేట్ లైసెన్సింగ్ అథారిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మిథిలేశ్ కుమార్ తెలియజేశారు. ఈ మేరకు అఫిడ్‌విట్‌ను సమర్పించారు. ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ  పతంజలి సంస్థపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి విదితమే.

దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం అసత్య, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని హెచ్చరించింది. ఇకపై అలాంటివేవీ ఉండబోవని అప్పట్లో సంస్థ తరఫు న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు.  అయినా, వాటిని ఉల్లంఘించటంతో కోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ప్రస్తుతం ఈ అంశం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉంది.