ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్

 
* విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ 
 
ఆంధ్రప్రదేశ్‌ ఇంటిలిజెన్స్ చీఫ్ (నిఘా విభాగాధిపతి)గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కుమార్‌ విశ్వజిత్‌ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పీహెచ్‌డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. వీరు తక్షణమే బాధ్యతల్లో చేరాలని ఆదేశించింది. విధుల్లో చేరినట్లుగా కంప్లెయిన్స్‌ రిపోర్టును గురువారం ఉదయం 11 గంటల్లోగా పంపించాలని కోరింది. 
 
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్‌ సెక్రటరీ అవినాష్‌ కుమార్‌ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల క్రితం నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ బదిలీ అయిన అధికారుల భర్తీ కోసం నిఘా అధిపతి పోస్టుకు రైల్వే ఏడీజీ కుమార విశ్వజీత్‌, ఏపీఎస్పీ ఏడీజీ అతుల్‌ సింగ్‌, సీఐడీ ఏడీజీ సంజయ్‌ పేర్లు ప్రభుత్వం పంపింది.
వాటిని పరిశీలించిన ఈసీ గతంలోనూ ఎన్నికల సమయంలో నిఘా అధిపతిగా వ్యవహరించిన కుమార విశ్వజీత్‌ను ఎంపిక చేసింది.  బెజవాడ సీపీ పోస్టుకు రవాణా శాఖ కమిషనర్‌ మనీశ్‌ కుమార్‌ సిన్హా, ఏసీబీ డైరెక్టర్‌ పీహెచ్‌డీ రామక్రిష్ణ, టెక్నికల్‌ సర్వీసెస్‌ ఐజీ ఎస్‌.హరికృష్ణ పేర్లు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. విజయవాడ సీపీ పీహెచ్‌డీ రామకృష్ణను ఎన్నికల సంఘం నియమించింది.
 
కుమార్‌ విశ్వజిత్‌ 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం రైల్వే విభాగం అదనపు డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ… ఈసీ ఈయన్నే నిఘా విభాగాధిపతిగా నియమించింది.  ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక కూడా నాలుగైదు నెలల పాటు అదే పోస్టులో కొనసాగారు. ఆ తర్వాత హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డీజీగా, ఏసీబీ డీజీగా పనిచేశారు. ఆయన నిఘా విభాగాధిపతిగా విధులు చేపట్టడం ఇది రెండోసారి.
 
2001 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన పీహెచ్‌డీ రామకృష్ణ.. డీఐజీ స్థాయి అధికారి. గతంలో చిత్తూరు, గుంటూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. . చిత్తూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసిన సమయంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ ముఠాలను పట్టుకోవడంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. గతంలో నిఘా విభాగంలోనూ, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధిపతిగానూ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఏసీబీలో డైరెక్టర్‌గా ఉన్నారు.

ఇటీవల విజయవాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధ బస్సు యాత్ర జరిగింది. ఆ సమయంలో ముఖ్యమంత్రిపై రాయితో దాడి ఘటన కలకలంరేపింది. ఈ ఘటన కలకలంరేపగా ఎన్నికల సంఘం కూడా సీరియస్‌గా తీసుకుంది.. ఈ రాయి దాడి ఘటనతో పాటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు అధికారులపై బదిలీ వేటు వేసింది.