దేశంలో కాషాయ కెరటం ఉప్పొంగుతోంది

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. ఇటీవలే రాజకీయ రంగ ప్రవేశం చేసిన కంగన హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తన నియోజకవర్గంతోపాటు ఇతర బీజేపీ అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం చేస్తోంది.

తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ బీజేపీ అభ్యర్థి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. సంప్రదాయ రాజస్థానీ తలపాగా ధరించి పార్టీ జెండా చేతపట్టి జోధ్‌పూర్‌లో మెగా రోడ్‌ షో నిర్వహించింది. ఈ ర్యాలీ ‘భారత్‌ మాతాకీ జై..’, ‘జై శ్రీరామ్‌..’ నినాదాలతో హోరెత్తింది. 

ఈ సందర్భంగా కంగన మాట్లాడుతూ  దేశంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ‘ప్రజల్లో బీజేపీపై ప్రేమ, ఆప్యాయత కనిపిస్తున్నాయి. జోధ్‌పూర్‌ ప్రజలకు బీజేపీపై పూర్తి విశ్వాసం ఉంది. దేశంలో ఇప్పటికే కాషాయ కెరటం ఉప్పొంగుతోంది.. ఇకపైనా ఆ అలలు కొనసాగుతాయి’ అని కంగన వ్యాఖ్యానించింది.

మరోవైపు పాలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత పీపీ చౌదరికి మద్దతుగా కంగన ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడింది. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

 ‘వారు నా వ్యక్తిత్వంపై దాడి చేశారు. కానీ నా సైన్యం ఆ ఆరోపణలను తిప్పికొట్టింది. ఎందుకంటే నాలోనూ రాజస్థాన్ డీఎన్ఏ ప్రవహిస్తోంది’ అంటూ ధ్వజమెత్తారు. బీజేపీ ఎంపీగా పోటీ చేయ‌నున్న సినీ న‌టి కంగ‌నా ర‌నౌత్ పై  కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే సోషల్‌ మీడియా వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

ఆమె చేసిన పోస్ట్‌ తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై కంగన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనేక చిత్రాల్లో అనేక విభిన్న పాత్రల‌ను పోషించిన‌ట్లు ర‌నౌత్ పేర్కొన్నది. ర‌జ్జో చిత్రంలో వేశ్యగా చేశాన‌ని, త‌లైవా చిత్రంలో విప్లవ నేత‌గా చేసిన‌ట్లు తెలిపింది. మ‌న కూతుళ్లను స్వేచ్ఛగా ఉంచాల‌ని, ప్రతి మ‌హిళ‌ను గౌర‌వించాల‌ని ర‌నౌత్ పేర్కొన్నది. అయితే కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాతే ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చింది. త‌న‌కు తెలియ‌కుండా త‌న అకౌంట్ నుంచి పోస్టు జ‌రిగిన‌ట్లు ఆమె వివరించింది.