రైల్వే ప్రయాణికులకు రూ.20కే భోజనం

జనరల్ కోచ్​లో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వేశాఖ కేవలం రూ.20కే ఆహారాన్ని అందిస్తోంది. అలాగే కేవలం రూ.3కే తాగునీటిని ఇస్తోంది. ఎకానమీ ఫుడ్ పేరిట దేశవ్యాప్తంగా ఉన్న 100 రైల్వే స్టేషన్లలో 150 ఎకానమీ ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేసింది.  రూ.20కి అందించే ఎకానమీ మీల్స్​లో 7 పూరీలు (175 గ్రాములు), ఆలు కూర (150 గ్రాములు), పచ్చడిని రూ.20కి అందిస్తారు.

రూ.50కి అందించే మీల్​లో అన్నం, కిచిడీ, ఛోలే-కుల్చే, ఛోలే-భటూరే, పావ్‌ భాజీ, మసాలా దోశల్లో ఒక దానిని ఎంచుకోవచ్చు. దీని ధరను రూ.50గా నిర్ణయించారు. కాగా, రైల్వే ప్రయాణికులకు తక్కువ ధరలకు పౌష్టికాహారం, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర రైల్వేలోని లఖ్​నవూ డివిజన్ సీనియర్ డీసీఎం రేఖా శర్మ తెలిపారు. 

సాధారణ కోచ్​ల్లో ప్రయాణించే ప్రయాణికులకు తక్కువ ధరలకు ఆహారం, స్నాక్స్, కాంబో మీల్స్, ప్యాకేజ్డ్ వాటర్​ను అందించడానికి ప్లాట్‌ ఫారమ్​లోని జనరల్ క్లాస్ కోచ్‌ల వెలుపల ఎకానమీ ఫుడ్ కౌంటర్లు ప్రారంభించినట్లు వెల్లడించారు.  మరోవైపు, రైల్వే ప్రయాణికులకు పరిశుభ్రతతో కూడిన పౌష్టికాహారం అందిస్తున్నామని ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ శోభన్ చౌధరీ తెలిపారు.

ఎకానమీ ఫుడ్ నాణ్యత, పరిశుభ్రతను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. భారతీయ రైల్వేలోని 100 స్టేషన్లలో 150 ఎకానమీ ఫుడ్ కౌంటర్లు నిర్వహిస్తున్నారు.  ఈశాన్య రైల్వేలోని గోరఖ్‌ పుర్, లఖ్ నవూ జంక్షన్, ఛప్రా జంక్షన్, సివాన్ జంక్షన్, మౌ జంక్షన్, బనారస్ జంక్షన్, కత్‌ గోడం స్టేషన్‌లలో ఎకానమీ ఫుడ్ కౌంటర్లు అందుబాటులోకి వచ్చాయి. రూ.20 ఎకానమీ ఫుడ్ లభిస్తోంది. 

అంతేకాకుండా రూ.50కి లెమన్ రైస్ విత్ పికిల్ (200 గ్రాములు), చింతపండు రైస్ విత్ పికిల్ (200 గ్రాములు), దాల్ ఖిచ్డీ విత్ పికిల్ (200 గ్రాములు) లభిస్తుంది. ఉత్తర రైల్వే మాదిరిగానే ఈశాన్య, దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రయాణీకులకు తక్కువ ధరలకు ఆహార పదార్థాలను అందిస్తోంది.