తెలంగాణాలో అన్ని స్థానాల్లో బిజెపి క్లీన్‌స్వీ ప్

ప్రధాని నరేంద్ర మోదీ హవాతో తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ క్లీన్‌స్వీప్ చేస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం నామినేషన్ వేసిన సందర్భంగా రాజేంద్రనగర్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా  ప్రసంగిస్తూ బిజెపి అండగా అన్ని వర్గాలు ఉన్నాయని, దేశంలో 400కు పైగా ఎంపి స్థానాల్లో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ  కావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతు న్న లోక్‌సభ ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ణయించేవని, ప్రజలం తా దేశం కోసం మోదీ  నాయకత్వా న్నిబలపరుస్తున్నారని చెప్పారు. 

ప్రతిపక్ష పార్టీలు అధికారమే లక్ష్యంగా సిద్ధాంతాలను గాలికి వదిలేసి ఇండియా కూటమి పేరుతో ఒక్కటైనా జనం మాత్రం వారిని విశ్వసించడం లేదని అన్నారు.కూటమి పేరుతో ఒక్కటైనవారు ఆయా రాష్ట్రాల్లో మాత్రం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం చూస్తున్న జనం కామెడీగా తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

రాహుల్ గాంధీ కేరళలో సిపిఎంను, పశ్చిమ బెంగాలలో తృణమూల్‌ను తిడుతూ ఢిల్లీలో మాత్రం కూటమి అంటూ దోస్తీ చేస్తారని వ్యాఖ్యానించారు. మోదీ  ప్రభుత్వ సమర్థవంతమైన విధానాలతో అంతర్జాతీయంగా భారత్ అగ్రభాగం వైపు సాగుతోందని తెలిపారు. 2030 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయమని భరోసా వ్యక్తం చేశారు. 

చేవెళ్ల బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఘన విజయం సాధించనున్నారని చెప్పారు. కాగా ప్రజల అండతో చేవెళ్ల గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తామని చేవెళ్ల బిజెపి ఎంపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు బిజెపి ఎంపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంపి లక్ష్మణ్, మాజీ ఎంఎల్‌ఎ కె.ఎస్.రత్నం, పార్టీ మహేశ్వరం ఇన్‌ఛార్జి శ్రీరాములు యాదవ్‌లతో కలిసి కలెక్టర్ శశాంకకు నామినేషన్ పత్రాలను అందజేశారు.