ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌ మసాలాలపై హాంకాంగ్‌ నిషేధం

భారత్‌కి చెందిన ప్రముఖ కంపెనీల మసాలా ఉత్పత్తులపై విదేశాల్లో వరుసగా ఆంక్షలు విధిస్తున్నారు. ఇటీవలే ఎవరెస్ట్‌ ఫిష్‌ కర్రీ మసాలాపై సింగపూర్‌ నిషేధం విధించగా, తాజాగా ఎవరెస్ట్‌తోపాటు మరో కంపెనీపై హాంకాంగ్‌ వేటు వేసింది. ఎండీహెచ్‌  సంస్థ తయారు చేస్తున్న సాంబార్ మసాలా, ఎవరెస్ట్‌  ఆహార ఉత్పత్తులపై కూడా వేటువేసింది. 

ఈ మసాలాలో ఇథిలీన్‌ ఆక్సైడ్‌ మోతాదుకుమించి ఉంటున్నదని, అందుకే నిషేధిస్తున్నామని స్పష్టం చేసింది. ఇది పురుగుల మందు అని, దానివల్ల ప్రాణానికి ముప్పు అని స్పష్టం చేసింది. ఈ నెల 5వ తేదీనే వాటిని బ్యాన్‌ చేసినట్లు హాంగ్‌కాంగ్‌ ఆహార భద్రతా విభాగమైన సెంటర్‌ ఫర్‌ ఫుడ్‌ సేఫ్టీ (సీఎఫ్‌ఎస్‌) తెలిపింది. 

సాధారణ తనిఖీల్లో భాగంగా అన్ని ఆహార పదార్థాలను పరిశీలించగా ఎండీహెచ్‌ గ్రూప్‌నకు చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా పౌడర్, కర్రీ పౌడర్‌లో పెస్టిసైడ్‌, ఇథిలీన్ ఆక్సైడ్‌ ఉన్నట్టు గుర్తించామని అధికారులు తెలిపారు. మొత్తం మూడు రిటైల్ ఔట్‌లెట్స్‌ నుంచి ఈ ప్యాక్‌లను సేకరించి పరిశీలించామని వెల్లడించారు. 

దీంతో ఆ ఉత్పత్తుల విక్రయాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలోనూ ఇదే రసాయనం ఉందని వెల్లడించారు. ఇది క్యాన్సర్‌ కారకాల జాబితాలో ఉందని పేర్కొన్నారు. అంతకు ముందు, భారత్‌ నుంచి దిగుమతి చేసుకున్న ‘ఎవరెస్ట్‌ చేపల కూర మసాలా’లో పరిమితికి మించి పురుగుమందు అవశేషాలు ఉన్నట్టు సింగపూర్‌ ఫుడ్‌ ఏజెన్సీ (ఎస్‌ఎఫ్‌ఏ) ఆరోపించింది. 

దీంతో ఫిష్‌ మసాలా ప్యాకెట్లను రీకాల్‌ చేయాలని ఎస్‌ఎఫ్‌ఏ ఆదేశించింది. హాంకాంగ్‌లోని సెంటర్‌ ఫర్‌ ఫుడ్‌ సేఫ్టీ జారీ చేసిన నోటిఫికేషన్‌కు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్టు సింగపూర్‌ తెలిపింది. ఉత్పత్తులను వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభించాలని ఎస్పీ ముత్తయ్య అండ్‌ సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సూచించింది. అయితే ఈ ఆరోపణపై ఎవరెస్ట్‌ కంపెనీ ఇంకా స్పందించలేదు.

మరోవంక, జూన్ 2023లో, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ 11 రాష్ట్రాల నుండి ఎవరెస్ట్ సాంబార్ మసాలా, గరం మసాలాతో పాటు నెస్లే మ్యాగీ మసాలా-ఏ-మ్యాజిక్‌లను రీకాల్ చేయాలని ఆదేశించింది. ఉత్పత్తులు విరేచనాలు, వికారం కలిగించే బ్యాక్టీరియా అయిన సాల్మొనెల్లాకు పాజిటివ్ పరీక్షించిన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేసింది.  సెప్టెంబర్ 2019లో, సాల్మొనెల్లా కాలుష్యం కారణంగా ఉత్తర కాలిఫోర్నియాలో పంపిణీ చేసిన సాంబార్ మసాలాను రీకాల్ చేయమని  ఎండీహెచ్‌ని కోరింది.