టాల్కమ్‌ పౌడర్‌ తో మహిళ మృతి.. రూ.375 కోట్ల పరిహారం

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన జాన్సన్ అండ్‌ జాన్సన్‌, కెన్‌వ్యూ కంపెనీలకు చెందిన బేబీ పౌడర్లు వాడడంతో క్యాన్సర్‌ బారినపడి మృతి చెందిన మహిళ కుటుంబానికి ఏకంగా రూ.375 కోట్ల పరిహారం చెల్లించాలని రెండు కంపెనీలను చికాగో కోర్టు ఆదేశించింది. దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోర్టు తీర్పును వెలువరించింది. 

థెరీసా గార్షియా అనే 2020లో మహిళ క్యాన్సర్‌ బారినపడి మృతి చెందింది. ఆమె మృతికి 70శాతం బాధ్యత కెన్‌వ్యూ కంపెనిదేనని చికాగో కోర్టు న్యాయమూర్తులు స్పష్టం చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం జాన్సన్‌ అండ్‌ జానన్స్‌, కెన్‌వ్యూ పూర్వ సంస్థ క్యాన్సర్‌ కలిగించే యాస్బెస్టోస్‌ ఉన్న బేబి టాల్కం పౌడర్‌లను విక్రయించారని  ఆరోపించింది. 

ఈ మేరకు ఆధారాలను కోర్టుకు సమర్పించింది. వాటిని పరిశీలించిన న్యాయస్థానం 30శాతం బాధ్యత జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌తో పాటు దాని అనుబంధ సంస్థ తీసుకోవాలని ఆదేశించింది. అయితే, తమ ఉత్పత్తుల్లో క్యాన్సర్‌ కారకాలు లేవని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వాదనలు వినిపించింది. తాము వందేళ్లుగా బేబీ పౌడర్‌ను మార్కెటింగ్‌ చేశామని తెలిపింది.

ఇప్పటికే తాము ఆర్థికంగా దివాళా తీశామంటూ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది. కంపెనీ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. రెండు కంపెనీలకు 45 మిలియన్‌ డాలర్లు (భారతీయ కరెన్సీలో దాదాపు రూ.375కోట్లు) పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కోర్టు తీర్పుపై బాధితురాలి కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. 

చికాగో కోర్టు తీర్పును పైకోర్టులో సవాల్‌ చేయనున్నట్లు జేఅండ్‌జే తెలిపింది. గతంలో పలు కేసులు నమోదయ్యాయని, అందులో తామే విజయం సాధించామని తెలిపింది. కంపెనీ విక్రయించిన పౌడర్‌ సురక్షితమేనని కోర్టులో గతంలో తేల్చినట్లు కంపెనీ పేర్కొంది. అయితే, కెన్‌వ్యూ కంపెనీ మాత్రం స్పందించలేదు. 

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ బేబీ పౌడర్‌ విక్రయాలను నిలిపివేసినట్లు కెన్‌వ్యూ ప్రతినిధులు పేర్కొన్నారు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సైతం 2020 ఉత్తర అమెరికా మార్కెట్ల నుంచి బేబీ పౌడర్లను ఉపసంహరిస్తామని.. 2023 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా టాల్కం బదులు మొక్కజొన్న గంజి కలిపిన పౌడర్లను విక్రయిస్తామని తెలిపింది.