ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. తనకు ఆరోగ్యం సరిగా ఉండటం లేదని, బ్లడ్లో షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులు వస్తున్నాయని, అందుకోసం తన డాక్టర్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించే అవకాశం ఇవ్వాలంటూ అరవింద్ కేజ్రీవాల్ పెట్టుకున్న పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
జైలులోని ఇతర నిందితులు, ఖైదీల మాదిరిగానే కేజ్రీవాల్కు కూడా అవే సదుపాయాలు, సౌకర్యాలు అందుతాయని స్పష్టం చేసింది. ఇక ఇన్సులిన్ అందించాలని కేజ్రీవాల్ పెట్టుకున్న అభ్యర్థనపై స్పందించిన కోర్టు జైలు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. డయాబెటిక్ పేషంట్ అయిన కేజ్రీవాల్కు రోజూ ఇన్సులిన్ ఇవ్వడం అవసరమా లేదా అనేది తేల్చడానికి డాక్టర్ల టీమ్ను ఏర్పాటు చేయాలని తీహార్ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
స్పెషలిస్ట్ డాక్టర్లతో కేజ్రీవాల్కు ప్రత్యేక చికిత్స అందేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. నెల రోజులుగా తనకు జైలు అధికారులు ఇన్సులిన్ ఇవ్వడం లేదంటూ గత వారమే కేజ్రీవాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాగా, కేజ్రీవాల్కు తీహార్ జైలు అధికారులు ఇన్సులిన్ ఇచ్చారని మంగళవారం ఆప్ నిర్ధారించింది. లో డోసు ఇన్సులిన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ సోమవారం 217గా ఉన్నట్లు తెలిపారు. అయితే షుగర్ లెవల్ 200 దాటినప్పుడు లో డోసులో ఇన్సులిన్ ఇవ్వవచ్చు అని ఎయిమ్స్ వైద్యుల బృందం సూచించింది.
ఇక తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలతో బెయిల్ పొందాలనే ఉద్దేశంతోనే మామిడిపండ్లు, స్వీట్లు ఎక్కువగా తిని బ్లడ్లో షుగర్ లెవల్స్ భారీగా పెంచుకుంటున్నారని గతంలోనే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ అధికారులు తెలిపారు. అయితే తాను ఇన్సులిన్ తీసుకోవడం కొన్ని నెలల క్రితమే ఆపేసినట్లు చెప్పారని, అందుకే తాము ఆయనకు ఇన్సులిన్ను ఇవ్వడం లేదని ఈడీ పేర్కొంది.
మరోవంక, కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకుని అసాధారణ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయ విద్యార్థి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్పై విచారణ చేసిన హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ధర్మాసనం దాన్ని తిరస్కరించింది. ఈ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్కు రూ.75 వేలు జరిమానా విధించింది.
ఈ పిటిషన్ను కేజ్రీవాల్ స్వయంగా వ్యతిరేకించడం గమనార్హం. కేవలం ప్రచారం కోసమే ఈ పిటిషన్ దాఖలు చేశారని, అసలు ఆ పిటిషన్ వేసిన వ్యక్తి ఎవరు అంటూ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది రాహుల్ మెహ్రా ప్రశ్నించారు. ఈ సందర్భంగా పిటిషనర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. రూ.75 వేల జరిమానా వేసింది.
More Stories
వేముల రోహిత్ దళిత్ కాదు…. కేసు మూసివేత
దుమారం రేపుతున్న బెంగాల్ గవర్నర్ పై లైంగిక ఆరోపణలు
వయనాడ్లో ఓటమి భయంతో రాయ్బరేలి బరిలో