రష్యన్ వ్యూహాత్మక బాంబర్‌ను కూల్చేసిన యుక్రెయిన్

ఒక రష్యన్ వ్యూహాత్మక బాంబర్‌ను తాము కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం వెల్లడించింది. అయితే, రష్యన్ అధికారులు ఆ వాదనను తోసిపుచ్చారు. ఒక యుద్ధ ప్రక్రియ తరువాత ఒక లోపం వల్ల విమానం అంతగా జనం లేని ప్రాంతంలో కూలిపోయిందని మాస్కో అధికారులు తెలిపారు.  అయితే, ఏ ప్రకటననూ స్వతంత్రంగా నిర్ధారించలేకపోయారు.

రెండు సంవత్సరాలకు పైనుంచి సాగుతున్న యుద్ధంలో రష్యన్ యుద్ధ విమానాలను కూల్చివేశామన్న ఉక్రెయిన్ గత ప్రకటనలపై మాస్కో మౌనం వహించడమో లేక వాటిని ఖండించడమో జరిగింది. ఇది ఇలా ఉండగా, ఉక్రెయిన్ మధ్య డినిప్రో ప్రాంతంలోని నగరాలపై రష్యన్ క్షిపణుల దాడి జరిగిందని, 8 సంవత్సరాల బాలికతో సహా ఎనిమిది మంది మృతి చెందారని, మరి 25 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలియజేశారు.

మరిన్ని పాశ్చాత్య గగనతల రక్షణ వ్యవస్థలను సమకూర్చాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ మళ్లీ విజ్ఞప్తి చేశారు.  ఇటీవలి ఇరానియన్ దాడిని ఇజ్రాయెల్ తిప్పికొట్టిన తీరుతో ఆయన పోలిక తెస్తూ యుఎస్‌కు ఆ విజ్ఞప్తి చేశారు. కాగా, టియు 22ఎం3 బాంబర్‌ను విమాన విధ్వంసక క్షిపణులతోకూల్చివేయడానికి వైమానిక, మిలిటరీ వేగు సంస్థలు సహకరించుకున్నాయని ఉక్రెయిన్ తెలియజేసింది.

తమ భూభాగంలో నుంచి ఉక్రెయిన్ లక్షాలపై కెహెచ్22 క్రూజ్ క్షిపణుల ప్రయోగానికి రష్యా సాధారణంగా ఆ బాంబర్‌ను ఉపయోగిస్తుంటుంది. ఆ విమానం అణ్వస్త్రాలను కూడా తీసుకువెళ్లగలదు.

ఉక్రెయిన్ సరిహద్దుకు వందలాది కిలో మీటర్ల దూరంలో స్టావ్రోపోల్ ప్రాంతంలో ‘ఒక నిర్జన ప్రదేశం’లో యుద్ధ విమానం కూలిందని రష్యన్ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. విమానంలో నుంచి దూకిన తరువాత ముగ్గురు సిబ్బందిని రక్షించినట్లు, నాలుగవ ఉద్యోగి కోసం అన్వేషణ సాగుతున్నట్లు మంత్రిత్వశాఖ వివరించింది.