భారతీయులు సహా విదేశీ విద్యార్థులు తమ సొంతదేశానికి వెళ్లినట్టయితే ప్రస్తుతం ఉన్న ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రయోజనాలను కొనసాగించడానికి సెప్టెంబరు 15 నాటికి తిరిగి వచ్చేయాలని అమెరికాలోని యూనివర్సిటీలు సూచించాయి. ప్రస్తుతం అమలులో ఉన్న `డ్యూరేషన్ అఫ్ స్టేటస్’ విధానాన్ని రద్దు చేస్తూ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ (డిహెచ్ఎస్) సరికొత్త నిబంధనలు తీసుకురానున్న నేపథ్యంతో ఎఫ్, జే వీసాదారులకు ఈ హెచ్చరికలు జారీ చేశారు.
తాజా నిబంధన ప్రకారం విదేశీ విద్యార్థులు గరిష్టంగా నాలుగేళ్ల కాలానికి మాత్రమే అమెరికాలో నివసించేందుకు అనుమతి ఉంటుంది. ‘‘ఈ కొత్త చట్టం అమలులోకి రావడానికి 60 రోజుల వ్యవధి ఉంది. సెప్టెంబర్ 8, 2026న తరగతులు ప్రారంభమయ్యే లోపే విద్యార్థులందరూ న్యూయార్క్ చేరుకోవాలని సూచిస్తున్నాం’’ అని కొలంబియా యూనివర్సిటీ తన నోటీసులో పేర్కొంది.
ఎఫ్-1 స్టూడెంట్ వీసా, జె-1 ఎక్స్ఛేంజ్ విజిటర్స్ వీసా, విదేశీ జర్నలిస్టులకు ఉద్దేశించిన వీసా కలిగిన వారి నివాసకాలాన్ని గరిష్టంగా నాలుగేళ్లకు పరిమితం చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కఠిన నిబంధనలను ఖరారు చేసింది. ఈ నిబంధన ప్రకారం.. చదువు పూర్తయిన తర్వాత ఇచ్చే గ్రేస్ పీరియడ్ను 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించారు.
అంతేకాకుండా, ఏ పొడిగింపు కోసమైనా విద్యార్థులు ఫారం ఐ-539 ద్వారా అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సిఐఎస్) ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుత విధానం ప్రకారం ఎఫ్-1 విద్యార్థులు తమ అకడమిక్ స్టేటస్ను కొనసాగించినంత కాలం అమెరికాలో నివసించడానికి అనుమతి ఉంది.
ఇప్పటికే డ్యురేషన్ ఆన్ స్టేటస్ విధానం కింద అమెరికాలో ఉన్న విద్యార్థులు ఫామ్ ఐ-20లో పేర్కొన్న కోర్సు ముగిసే తేదీ వరకు లేదా ఆమోదించి ఓపీటీ లేదా స్టెమ్ ఓపీటీ ముగిసే వరకు కొనసాగవచ్చు. అయితే, ఈ మినహాయింపు కూడా కొత్త చట్టం అమలులోకి వచ్చిన తేదీ నుంచి గరిష్టంగా నాలుగేళ్ల కాల పరిమితికి లోబడి ఉంటుంది. నిష్క్రమణ వ్యవధితో కలిపి ఇది నవంబర్ 14, 2030 కంటే దాటడానికి వీల్లేదు.
అమెరికా విధానంలో వచ్చిన ఈ ఆకస్మిక మార్పుతో పరిశోధనాత్మక కోర్సులు, ముఖ్యంగా డాక్టోరల్ కోర్సులు, మెడికల్ ట్రెయినింగ్లు సాధారణంగా నాలుగేళ్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంటాయని ఎఫ్ఐఐడీఎస్ తెలిపింది. జె-1 రిసెర్చ్ స్కాలర్లు, వైద్యులు తమ కోర్సులు పూర్తి చేయడానికి ఐదు నుంచి ఏడేళ్ల సమయం పడుతుంది.
అంతేకాకుండా వీసా పొడిగింపుపై స్పష్టత లేకపోవడం వల్ల ల్యాబొరేటరీల పనితీరు దెబ్బతినడమే కాకుండా, గ్రాడ్యుయేషన్ ప్రక్రియ ఆలస్యమవుతుందని, అంతర్జాతీయ ప్రతిభపై ఆధారపడే ఫ్యాకల్టీ నియామకాలపై ప్రభావం పడుతుందని హెచ్చరించింది.

More Stories
బ్రిటన్లో తొలి ఏఐ మంత్రిగా భారత సంతతి కనిష్క నారాయణ్
ఉక్రెయిన్ ఓడరేవు నౌకపై దాడిలో నలుగురు భారతీయులు మృతి
అమెరికాలో 18,000 మంది భారతీయులకు బహిష్కరణ గండం