దేశంలో రిజర్వేషన్ల కోటాకు అతి పెద్ద మద్దతుదారు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని నరేంద్ర మోదీయే అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అధికార బిజెపి దేశంలో దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లకు వ్యతిరేకం అని కాంగ్రెస్ దుష్ప్రచారానికి దిగుతోందని విమర్శించారు.
రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో హర్సోలిలో శనివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బిజెపిపై తప్పుడు ప్రచారంలో కాంగ్రెస్ దిట్ట అయిందని విమర్శించారు. కీలక విషయాలను తీసుకోవడం, బిజెపిపై అసత్యాలు వల్లించడం పరిపాటి అయిందని ధ్వజమెత్తారు.
నిజానికి కాంగ్రెస్ పార్టీయే ఒబిసి వ్యతిరేకం అని, చాలాకాలం కోటా సంబంధిత నివేదికను తొక్కిపెట్టిందని అమిత్ షా మండిపడ్డారు. దళితులు, గిరిజన సోదరులలో బిజెపి పట్ల దురభిప్రాయం రేకెత్తేలా చేసేందుకు కాంగ్రెస్ శాయశక్తులా పాటుపడుతోందని ఈ సభాముఖంగా తాను తెలియచేసుకుంటున్నానని షా వివరించారు.
కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో రిజర్వేషన్ల ప్రస్తావన తీసుకువచ్చింది. ఎస్సి, ఎస్టి, ఒబిసిలకు ఇప్పుడు 50 శాతం రిజర్వేషన్ల కోటా పరిమితిని పెంచుతామని, ఇందుకు రాజ్యాంగ సవరణకు దిగుతామని ప్రకటించింది. వెనుకబడిన వర్గాలకు చేయాల్సినంత అన్యాయం చేసి ఇప్పుడు తీరిగ్గా వారికి మేలు చేస్తామని ముందుకు రావడం కేవలం ఎన్నికల ఎత్తుగడ మాత్రమే అంటూ అమిత్ షా విరుచుకుపడ్డారు.
అయితే దీనిని ఎవరూ నమ్మబోరని తెలిపారు. ఇప్పుడు ప్రధాని, కేంద్రంలో 27 మంది మంత్రులు ఒబిసిలే అని తెలిపారు. రాజస్థాన్లో రెండు విడతల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ నెల 19, తరువాత 26వ తేదీలలో ప్రక్రియ ఖరారయింది.
More Stories
అమిత్ షాకు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్