సొంత దుకాణం కోసం రేవంత్ ప్రయత్నాలు

కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌రెడ్డికి సౌకర్యవంతంగా లేదని, ఆయన సొంత దుకాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. అన్నారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ని ఓడించే ప్రయత్నం చేస్తున్నారని స్వయంగా సీఎం చెబుతున్నారని, వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని స్వయంగా రేవంత్ అనుకుంటున్నారని గుర్తు చేశారు. 
 
పీసీసీ పదవి వేరే సీఎం పదవి వేరేనని చెబుతూ ముఖ్యమంత్రి కోసం కాంగ్రెస్ లో  పదవి కోసం పది మంది పోటీపడుతున్నారని, రెండో స్థానం కోసం కూడా  కాంగ్రెస్‌లో పోటీపడుతున్నారని తెలిపారు. భట్టి బీ ట్యాక్స్‌ అని కాంగ్రెస్‌ వాళ్లే లీకులు ఇచ్చారని చెప్పారు.  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు, రేవంత్‌కు చాలా పోలికలు ఉన్నాయని మహేశ్వర్ రెడ్డి తేలిపారు. 
 
ఎల్లో కాంగ్రెస్, గ్రీన్ కాంగ్రెస్, గాంధీ కాంగ్రెస్ పేరుతో మూడు గ్రూప్‌లు ఉన్నాయని అంటూ 25 మందితో తన వర్గం ఎమ్మెల్యేలకు తోడుగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను తెచ్చుకోవాలని రేవంత్ చూస్తున్నారని బిజెపి నేత ఆరోపించారు. మరోవంక,  రేవంత్‌కు పోటీగా 25 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారని ఆయన గుర్తు చేశారు. 
 
ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తనపై కుట్ర చేస్తున్నారనడం రేవంత్‌ అసమర్థతకు నిదర్శనమన ధ్వజమెత్తారు. గేట్లు ఓపెన్ చేసినా, విండోలను ఓపెన్ చేసినా ఎవరు కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదని ఎద్దేవా చేశారు.  గేట్లు ఎత్తేమని చెబుతున్నారు కదా.. ఎక్కడ ఎమ్మెల్యేలు? అంటూ ప్రశ్నించారు. కాగా తాము (బిజెపి) గేట్లు ఎత్తాల్సిన అవసరం లేదని.. ఉప ఎన్నికలు వస్తే హాయ్ శ్రీరామ్ అంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లేదని చెబుతూ వాళ్ల మధ్య విభేదాలే వాళ్లను బలహీనం చేస్తాయని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బిజెపి ఎమ్మెల్యేలు ఎవరితో టచ్‌లో లేరని.. బీజేపీ ప్రజలను నమ్ముకుందని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్లలో వాళ్లే కొట్టుకుంటారని పేర్కొన్నారు. 

ప్రభుత్వం కూలిపోతుందని, ముఖ్యమంత్రి వెంట భారీ వ్యవస్థ ఉన్నప్పటికీ కుట్ర జరుగుతుందని రేవంత్ అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఐదుగురు షిండేలు ఉన్నారని.. రేవంత్ రెడ్డి ప్లాన్ ఏ అంటే పార్టీలో ఉంటే.. నా వెంట ఎంత మంది వస్తారు ? ప్లాన్ బీ అంటే.. పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా దుకాణం పెట్టుకుంటే ఎంత మంది వస్తారు ? అంటూ బిజెపి నేత ఎద్దేవా చేశారు. రేవంత్ ఉద్రిక్తకు తట్టుకొలేక ఓ ఐపీఎస్‌ అధికారి గుండెపోటుతో మరణించారని ఆయన ఆరోపించారు.