తెలంగాణ విజిలెన్స్‌ డీజీ రాజీవ్ రతన్‌ కన్నుమూత

తెలంగాణ క్యాడర్‌ సీనియర్ ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ రతన్  గుండెపోటుతో కన్నుమూశారు. 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌ రతన్‌ ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం ఛాతీనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే ఏఐజి ఆస్పత్రికి తరలించారు1991 బ్యాచ్ కు చెందిన రాజీవ్ రతన్‌ను ఇటీవల విజిలెన్స్ డీజీ గా నియమించారు. విజిలెన్స్ డీజీగా నియమించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపారు. రాజీవ్ రతన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది.

సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్‌ రతన్‌ గతంలో పలు హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పిగా, పైర్ సర్వీసెస్ డిజిగా సేవలందించారు. హైదరాబాద్ రీజియన్ ఐజిగా, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండిగా వివిధ హోదాల్లో పని చేశారు.

రాజీవ్‌ రతన్‌ 1991 ఐపీఎస్‌ బ్యాచ్‌కి చెందిన ఆఫీసర్‌. గత ఏడాది మహేందర్‌రెడ్డి డీజీపీగా పదవీ విరమణ చేసిన సమయంలో కొత్త పోలీస్‌ బాస్‌ రేసులో రాజీవ్‌ రతన్‌ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. రాజీవ్ రతన్ మృతి పట్ల పలువురు ఐపీఎస్‌ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.

రాజీవ్ రతన్ హఠాన్మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని తెలిపారు.