రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ లో సేకరించిన డాటాను ధ్వంసం చేసే హడావుడిలో అధికారులు కీలకమైన మావోయిస్టులకు సంబంధించిన పాత డేటాను కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తున్నది. ప్రతిపక్ష నేతలతో పాటు ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబి) కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాత సమాచారాన్ని ధ్వంసం చేసేందుకు నిర్ణయించింది.
ఎస్ఐబీ మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు ఆ మేరకు డిసెంబర్ 4న కీలక డేటాను ధ్వంసం చేశారు. మొత్తం 17 కంప్యూటర్లకు చెందిన 42 హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసి మూసీ నదిలో, అటవీ ప్రాంతంలో పడేశారు. ప్రణీత్ రావు చేసిన పనికి ఇంటెలిజెన్స్ సేకరించిన కీలక సమాచారం పోయినట్లు విచారణ అధికారులు గుర్తించారు. మావోయిస్టులకు సంబంధించిన పాత డేటా పోయినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ డేటాను తిరిగి పొందే అవకాశం కూడా లేదని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు విలువైన భూములకు సంబంధించిన డేటాను కూడా ధ్వంసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రణీత్ రావు తాజా డేటాను మాత్రమే కాకుండా దశాబ్దాలుగా ఎస్ఐబి సేకరించిన సమాచారం మొత్తాన్ని కూడా ధ్వంసం చేసినట్లుగా చెబుతున్నారు. ప్రణీత్ రావు చేసిన ప నితో పోలీ సులు తలలు పట్టుకుంటున్నారు.
మూసీ నది నుంచి రికవరీ చేసిన హార్డ్ డిస్క్ ల నుంచి డేటా రికవరీ సాధ్యం కాదని తేల్చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా జరిగినట్లు ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కోసం కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ టూల్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు.
మరోవంక, రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఇంటికి సమీపంలో గెస్ట్ హౌస్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిసిందని విచారణలో తేలింది. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్రెడ్డి ఇంటి సమీపంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు చెందిన గెస్ట్ హౌజ్లో సోమవారం పోలీసులు సోదాలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఈ గెస్ట్ హౌస్ ను ప్రణీత్ రావు టీమ్ కేంద్రంగా మార్చుకుందని పోలీసులు గుర్తించారు.
రేవంత్ రెడ్డి ఇంటికి అతి సమీపంలోని ఈ గెస్ట్ హౌస్ నుంచి అడిషనల్ ఎస్పీ భుజంగరావు ట్యాపింగ్ ఆపరేషన్ చేశారని తెలుస్తోంది. అయితే ప్రణీత్ రావు తరహాలో గెస్ట్ హౌజ్లో ఫోన్ ట్యాపింగ్ ఆధారాలన్నింటిని భుజంగరావు ముందే ధ్వంసం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని ఎమ్మెల్సీ నవీన్ రావు తెలిపారు. తనపై బురద జల్లేందుకు ఈ వ్యవహారంలో తన పేరు లాగుతున్నారని ఆరోపించారు. తన గెస్ట్ హౌజ్లో ఎలాంటి తనిఖీలు జరగలేదని స్పష్టం చేశారు.
మరోవైపు నల్లగొండ, హైదరాబాద్లలో రెండు చోట్ల ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్ దగ్గర పర్వతగిరి, సిరిసిల్ల, ఖమ్మంలో ఒక్కో చోట ట్యాపింగ్ సెంటర్ల ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు మొత్తం 7 ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. నల్లగొండ విటీ కాలనీలో నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల మానిటరింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
అలాగే ఖమ్మం జిల్లా కోసం నేలకొండపల్లి మామిడి తోటలోని గెస్ట్ హౌస్లో ట్యాపింగ్ సెంటర్ను పెట్టారు. హైదరాబాద్ ఎస్ఐబి ఆఫీస్తో పాటు జూబ్లీహిల్స్లోనూ ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటుచేశారు. వరంగల్, సిరిసిల్లలో సైతం ట్యాపింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారని పోలీసులు గుర్తించారు. కానిస్టేబుల్ నుంచి డిసిపి స్థాయి వరకు ట్యాపింగ్ను అడ్డం పెట్టుకుని సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నేతల కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు బయటపడింది. ఈ కేసుకు సంబంధించి పోలీస్ అదుపులో నలుగురు కానిస్టేబుల్స్ ఉన్నారు.
More Stories
ముగిసిన ఇదో విడత ప్రచారం … రేపే పోలింగ్
వడ్ల కొనుగోలు వేగవంతం చేయండి రేవంత్
మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థిని అరెస్ట్ చేసి విచారణ జరిపించండి