ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయాలపై ఉన్న ప్రేమ, రైతులపై లేదని, రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయాలని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన రైతు సత్యాగ్రహ దీక్షకు ఆయన హాజరై మాట్లాడారు.
సర్కార్ కు ముందుచూపు లేకపోవడంతోనే పంటలు ఎండిపోయాయని విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా సాగునీరు, విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో అన్నదాతలకు అబద్ధపు హామీలు ఆశ చూపి అధికారంలోకి వచ్చారని చెబుతూ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదని తెలిపారు. రూ.2 లక్షల రుణమాఫీ ఇవ్వలేదని మండిపడ్డారు.
పంటకు రూ. 500 బోనస్ ఇవ్వలేదని, రూ.15000 రైతు భరోసా సాయం ఇవ్వలేదని గుర్తు చేశారు. కౌలు రైతులకు రూ.12000 సాయం ఇవ్వలేదని చెప్పారు. సాగు నీరు లేదు, సబ్సిడీలు లేవని, ఇప్పుడు పంటలు ఎండిపోతే పరిహారం ఇచ్చే దిక్కు లేదని మండిపడ్డారు. వెంటనే పంట నష్టపోయిన రైతులకు సాయం అందించాలని డిమాండ్ చేశారు.
రైతులకు ఇచ్చిన హామీల విషయంలో అన్నదాతలకు క్షమాపణ చెప్పాలని బిజెపి నేత స్పష్టం చేశారు. దమ్ముంటే హామీలు అమలు చేశాకే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి రావాలని సవాల్ చేశారు. లేకుంటే ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తారని ఏలేటి మహేశ్వర్ రెడ్డిహెచ్చరించారు.
More Stories
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ వారే
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు