వంతెన ప్రమాదంలో భారతీయుల చొరవకు బిడెన్ ప్రశంస

అమెరికా బాల్టిమోర్‌ నగరంలోని ఫ్రాన్సిస్‌ స్కాట్‌ వంతెన మంగళవారం కూలింది. సింగపూర్ డాలి అనే నౌక వంతెనను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారని మేరీల్యాండ్‌ రాష్ట్ర పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా భారీ ప్రాణ నష్టం జరగకుండా చూసినందుకు నౌకలోని భారతీయ సిబ్బందిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రశంసించారు. 

వంతెన కూలిపోవడం వల్ల ఆరుగురు మృతి చెందడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బైడెన్‌ బుధవారం వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ.. ‘తమ ఓడపై నియంత్రణ కోల్పోయామని ఓడలోని సిబ్బంది గుర్తించారు. వెంటనే మేరీల్యాండ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే మేరీల్యాండ్‌ అధికారులు బ్రిడ్జిని మూసివేసి.. వాహనదారుల్ని నిలిపివేశారు’ అని తెలిపారు. 

ఓడలోని సిబ్బంది అప్రమత్తత కారణంగా పెను ప్రమాదం తప్పిందని, ఎంతో మంది ప్రాణాల్ని వారు కాపాడారని ఆయన వారిని అభినందించారు. ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే జరిగిందనడానికి కారణాలు లేవు. ఈ ఘటనలో ఎనిమిది మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ సంఖ్య మారవచ్చు కూడా. వీరిలో ఇద్దరినీ రెస్క్యూ అధికారులు రక్షించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. రెస్క్యూ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతుంది. అని బైడెన్‌ వివరించారు.

‘బాల్టిమోర్‌ నౌకాశ్రయం దేశంలో అతిపెద్ద షిప్పింగ్‌ హబ్‌లలో ఒకటి. గతేడాది ఎగుమతులు, దిగుమతుల్లో అమెరికాలో అగ్రశ్రేణిగా ఉంది. ప్రతి సంవత్సరం సుమారు 850,000 వాహనాలు ఈ నౌకాశ్రయం గుండా వెళతాయి’ అని బైడెన్‌ పేర్కొన్నారు. ఈ ప్రమాదం కారణంగా ఈ పోర్ట్‌ మూసివేనా త్వరలోనే మళ్లీ తిరిగి తెరవబడుతుందని బైడెన్‌ ప్రకటించారు.

 వంతెన కూలిపోవడంతో నదిలో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారని అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మంగళవారం ప్రకటించింది. వీరిద్దరూ నిర్మాణ కార్మికులు. వీరిలో ఒకరు శాన్‌ లూయిస్‌ పీటెన్‌కు చెందిన 26 ఏళ్ల వ్యక్తి, చిక్విములలోని కామోటన్‌కు చెందిన 35 ఏళ్ల వ్యక్తిగా మేరీల్యాండ్‌ అధికారులు గుర్తించినట్లు మంత్రిత్వశాఖ ధృవీకరించింది.

అసలేం జరిగింది?

బాల్టిమోర్ నుంచి శ్రీలంక‌కు 27 రోజుల్లో వెళ్లేందుకు ఆ నౌక రాత్రి 12.30ల‌కు పోర్టు నుంచి బ‌య‌లుదేరింది. బ‌య‌లుదేరిన కొన్ని క్ష‌ణాల‌కే ఆ నౌక‌లో ప‌వ‌ర్ పోవడంతో స‌డెన్‌గా ఆ నౌక స్టీరింగ్ కంట్రోల్ త‌ప్పింది. నౌక‌లో ఉన్న ఎల‌క్ట్రానిక్స్ ఏవీ ప‌నిచేయ‌లేదు. లంగ‌ర్‌కు లేక‌పోవ‌డంతో ఆ నీటిలో అది ముందుకు క‌దులుతూ వెళ్లింది. ప‌వ‌ర్ లేక‌పోవ‌డం వ‌ల్ల దాన్ని ఆప‌డం కూడా అసాధ్య‌మైంది.

స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు నౌక‌లో ఉన్న సిబ్బంది ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేశారు. ప‌లుమార్లు అలార‌మ్ మోగించారు. కానీ ప్ర‌యోజ‌నం లేకుండాపోయింది. మళ్లీ నౌక‌ను పోర్టుకు తీసుకువెళ్లేందుకు చాలా ప్ర‌య‌త్నాలు చేశారు. నౌక‌లో ఉన్న ఎమ‌ర్జెన్సీ జ‌న‌రేట‌ర్‌ను స్టార్ట్ చేశారు. కానీ షిప్‌లో ఉన్న ఇంజిన్లు మ‌ళ్లీ స్టార్ట్ కాలేదు. 

ఆ త‌ర్వాత మేడే కాల్ చేశారు. ప్ర‌మాదం పొంచి ఉంద‌ని వార్నింగ్ ఇచ్చారు. బ్రిడ్జ్‌ను నౌక ఢీకొనే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిక‌లు చేశారు. స్టీరింగ్ త‌ప్పిన షిప్ . బ్రిడ్జ్ దిశ‌గా దూసుకువ‌స్తున్న‌ట్లు ఓ ట్రాన్స్‌పోర్ట్ అధికారి ప్ర‌క‌టించారు. బ్రిడ్జ్‌పై ట్రాఫిక్‌ను ఆపేందుకు ప్ర‌య‌త్నించారు. వార్నింగ్ ఇవ్వ‌డం వ‌ల్ల బ్రిడ్జ్‌పై రెండు నిమిషాల వ్య‌వ‌ధిలోనే ట్రాఫిక్‌ను ఆప‌రేశారు. 

సుమారు 289 మీట‌ర్ల పొడువున్న నౌక‌ దాదాపు 2.4 కిలోమీట‌ర్ల పొడుగు ఉన్న బ్రిడ్జ్ కాంక్రీట్‌ను ఢీకొన్న‌ది. బ‌లంగా నౌక ఢీకొన‌డంతో.. ఆ బ్రిడ్జ్ వెంట‌నే కూలిపోయింది. ఒక్కొక్క ముక్క విరిగిప‌డింది. ప‌టాప్సో న‌దిపై ఉన్న వంతెన ఒక్క‌సారి కూలిప‌డింది. ఆ బ్రిడ్జ్‌పై ప‌నిచేస్తున్న రిపేర్ సిబ్బందిలో ఆరుగురు అదృశ్య‌మ‌య్యారు.