భారత్‌లోని నిరుద్యోగుల్లో 83 శాతం మంది యువతే

భారత్‌లోని నిరుద్యోగుల్లో 83 శాతం మంది యువతేనని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌వో) పేర్కొంది. 2022లో భారత్‌లోని మొత్తం నిరుద్యోగ జనాభాలో యువత 83 శాతం మంది ఉన్నారని తెలిపింది. ఐఎల్‌వో, ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్‌మెంట్ (ఐహెచ్‌డీ) సంయుక్తంగా రూపొందించిన ‘ఇండియా ఎంప్లాయ్‌మెంట్ రిపోర్ట్ 2024’ను చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ విడుదల చేశారు.

కాగా, నిరుద్యోగుల్లో విద్యావంతులైన యువకులు 2000లో 54.2 శాతం మంది ఉండగా, 2022లో ఇది 65.7 శాతానికి పెరిగినట్లు ఈ నివేదిక పేర్కొంది. అలాగే చదువుకున్న నిరుద్యోగుల్లో పురుషుల (62.2 శాతం) కంటే స్త్రీలు (76.7 శాతం) ఎక్కువగా ఉన్నారని తెలిపింది. భారత్‌లోని పట్టణ ప్రాంత యువ విద్యావంతులలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా కేంద్రీకృతమైందని ఈ రిపోర్ట్ పేర్కొంది.

మొత్తం నిరుద్యోగ యువతలో సెకండరీ లేదా ఉన్నత విద్య కలిగిన వారి వాటా 2000లో 35.2 శాతం ఉండగా, 20022 నాటికి 65.7 శాతం అంటే  రెట్టింపయ్యిందని వెల్లడించింది. 2000 నుంచి 2019 వరకు యువకుల ఉపాధి, ఉపాధి పెరుగుదల తక్కువగా కనిపించిందని పరిశోధకులు గుర్తించారు. 

కరోనా మహమ్మారి దీనికి కారణమని అంచనా వేశారు. మరోవైపు మరో దశాబ్దంలో భారత్‌లో యువ శ్రామిక శక్తి 7-8 మిలియన్లు  (70-80 లక్షలు) చేరుకుంటుందని ఈ అధ్యయనం తెలిపింది.  గత రెండు దశాబ్దాలుగా భారతదేశ ఉద్యోగ కథనంలో కార్మిక మార్కెట్‌ సూచికలలో కొన్ని ప్రతికూల మెరుగుదలలు కనబరిచింది. 

అయితే దేశంలో ఉపాధి పరిస్థితిని పరిశీలిస్తే వ్యవసాయేతర రంగాలలో తగినంత వృద్ధిని కొనసాగించింది. అదే సమయంలో వ్యవసాయ రంగం నుండి కూడా కార్మికులు ఇతర రంగాల్లోకి మళ్లారు. 2018కి ముందు వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి, వ్యవసాయ రంగంలో ఉపాధి కంటే అధిక రేటుతో పెరిగిందనేది వాస్తవం. అంటే వ్యవసాయ రంగానికి చెందిన కార్మికులు నిర్మాణ, సేవల రంగాలకు మళ్లినట్లు తెలుస్తోంది.

సుమారు 90 శాతం మంది కార్మికులు (వ్యవసాయేతర) అనధికారిక పనుల్లో ఉన్నారని సర్వే స్పష్టం చేసింది. అయితే 2000 తర్వాత క్రమంగా పెరిగిన సాధారణ శ్రమ వాటా 2018 తర్వాత క్రమంగా క్షీణించింది. ఈ సమయంలో ప్రజల జీవనోపాధి అభద్రతతో ఉందని నివేదిక తెలిపింది. వ్యవసాయేతర, వ్యవస్థీకృత రంగాల్లో సామాజిక రక్షణ చర్యలు కొద్ది శాతం మందికి మాత్రమే అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. 

”మోసపూరిత కాంట్రాక్టుల (ఉద్యోగిగా కొనసాగినా కాంట్రాక్ట్‌ కార్మికునిగానే పరిగణించడం) పెరుగుదల ఉందని, అయితే వీటిలో కొద్ది శాతం మందిని మాత్రమే దీర్ఘకాలిక కాంట్రాక్టుల్లోకి తీసుకున్నారని నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో ఐదు కీలక విధాన రంగాలపై దృష్టిసారించాలని పేర్కొంది. ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించడం, ఉపాధి నాణ్యతను మెరుగుపరచడం, కార్మిక మార్కెట్‌లో అసమానతలను పరిష్కరించడం, క్రియాశీల కార్మిక మార్కెట్‌తోపాటు లేబర్ మార్కెట్ నైపుణ్యాలు, విధానాలు బలోపేతం చేయడం వంటి చర్యలు చేపట్టాలని సూచించింది.