బాధితులపైనే హత్యాయత్నం కేసు నమోదు

 
* చెంగిచర్ల బాధితులకు బండి సంజయ్ పరామర్శ 

అమాయకులపై దాడులు చేసిన దుండుగలను వదిలేసి ఆత్మరక్షణ కోసం అడ్డుకున్న బాధితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బుధవారం మేడ్చల్ జిల్లాలోని చెంగిచర్ల విచ్చేసిన ఆయన అక్కడ పోలీసులు బారికేడ్లు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెంగిచర్ల నిషేధిత ప్రాంతమా? మనం పాకిస్తాన్‌లో ఉన్నమ? బంగ్లాదేశ్ లో ఉన్నామా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పేర్కొన్న మైనారిటీ డిక్లరేషన్ అంటే… హిందువులపై దాడులు చేయడమేనా? మహిళలు, గర్భిణీలని చూడకుండా దాడి చేసిన వాళ్లంతా కాంగ్రెస్ ద్రుష్టిలో లౌకిక వాదులా? దాడులు చేసిన దుండుగలను వదిలేసి ఆత్మరక్షణ కోసం అడ్డుకున్న బాధితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయడమే లౌకికవాదమా?’’అంటూ  ప్రశ్నించారు.

బాధితులంతా పేదలు. తిండికి లేక అల్లాడుతున్నవాళ్లు వాళ్లను ఆదుకోవడానికి వచ్చే వాళ్లను కూడా అడ్డుకుంటారా? అంటూ ధ్వజమెత్తారు. దాడులకు గురైన బాధితులను పరామర్శించేందుకు వస్తున్నారని తెలియడంతో వేలాది మంది బిజెపి కార్యకర్తలు, హిందుత్వ వాదులు తరలివచ్చారు. జై శ్రీరాం నినాదాలు చేస్తూ బండి సంజయ్‌తో కలిసి బాధితుల వద్దకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు బారికేడ్లు అడ్డుగా పెట్టారు. 

దీంతో ఆగ్రహానికి గురైన కార్యకర్త లు బారికేడ్లను తోసేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పలువురు కార్యకర్తలకు, పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. తోపులాటలో బండి సంజయ్ పడిపోతుండగా కార్యకర్తలు పట్టుకున్నారు. అనంతరం పోలీసుల ఆంక్షల మధ్య కొద్దిమంది కార్యకర్తలతో కలిసి సంజయ్ బాధితుల ఇండ్ల వద్దకు వెళ్లి పరామర్శించి దాడులకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ చెంగిచర్లలో జరిగిన వాస్తవాలను బయటకు వెళ్లకుండా పేద ప్రజలదే తప్పు అన్నట్లుగా పోలీసులు, కొందరు చిత్రీకరించే యత్నం చేస్తున్నారని విమర్శించారు.  హోలీ పండుగ రోజు భక్తి పాటలతో అమ్మవారిని కొలిచే సాంప్రదాయం ఇక్కడి ఎస్టీ సామాజికవర్గ ప్రజలకు ఉందని, కానీ కొందరు రోహింగ్యాలు, పోకిరీలు ఇక్కడికి వచ్చి పాటలు ఆపాలంటూ బెదిరించి, వందల మంది సంఘ విద్రోహ శక్తులు మూకుమ్మడిగా బాధితుల ఇండ్లపైకి వచ్చి మరణాయుధాలతో దాడి చేశారని మండిపడ్డారు. 

మరణాయుధాలతో దాడి చేశారు. వాళ్ల దాడిలో రూప, సమ్మక్క, వరుణ్,  పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.  బాధితులు మసీదుకు వెళ్లలేదు. రోహింగ్యాలున్న ప్రాంతానికి వెళ్లలేదు. వాళ్లే బాధితుల వద్దకు వచ్చి దౌర్జన్యం చేసి చిన్నా పెద్దా మహిళలనే తేడా లేకుండా విచక్షణా రహితంగా దాడులు చేశారు.

తెలంగాణలో హిందువుల పరిస్థితి దారుణంగా ఉంది. హిందువులపై దాడులు జరిగితే శాంతి భద్రతల సాకుతో మీడియాలో సైతం చూపడం లేదు. బైంసాలో కూడా ఇదే జరిగింది. కానీ మసీదుపై కొన్ని రాళ్లు పడితే ఏదో జరిగిపోయిందని మీడియాలో చూపారు. పోలీసులు, ప్రభుత్వం చెబితే శాంతిభద్రతల సాకుతో హిందువులపై దాడులు జరిగితే టీవీలో చూపకపోవడం దారుణం అంటూ సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.