ఎన్డీఏ కూటమికి జెపి మద్దతు

* ఏపీలో కులాల మధ్య పోరాటం
ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగుతోందని లోక్ సత్తా అధినేత జయ ప్రకాశ్ నారాయణ మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నామని బుధవారం నాడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో కలిసి బరిలోకి దిగుతామని జేపీ  వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు మరింత దిగజారాయని జయప్రకాశ్ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
రాష్ట్రంలో కులాల మధ్య పోరాటం జరుగుతోందని చెబుతూ వైసీపీ వైపు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటే, కమ్మ, కాపులు విపక్షాల వైపు ఉన్నారని పేర్కొన్నారు. సుపరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదని స్పష్టం చేశారు.  అభివృద్ధి చేస్తేనే మంచి ఇచ్చినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. అప్పులు తీసుకొచ్చి సంక్షేమం కోసం ఖర్చు చేయడం సరికాదని జేపీ సూచించారు. 
 
సంక్షేమమే పాలన అనుకుంటే ఆ దేశం, రాష్ట్రం అధోగతి పాలు కావడం ఖాయం అని హెచ్చరించారు. నేటి బాలలే రేపటి పౌరులు అంటారని పేర్కొంటూ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించాలని హితవు చెప్పారు. పేదరికం సమూలంగా వెళ్లిపోవాలని, అప్పుడే అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. సంక్షేమం అంటే తాత్కాలిక ప్రయోజనాలు అని, అభివృద్ధి అంటే దీర్ఘకాలిక సంపద సృష్టించడం అని  వివరించారు. ఉపాధి కల్పించి, పెట్టుబడులు అందజేసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

రాష్ట్రంలో కులాల గురించి ఎక్కువ ప్రస్తావన జరగడం పట్ల విచారకరం వ్యక్తం చేశారు. కులాలకు అతీతంగా పనిచేసే నేత లేరని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో చాలామంది నేతలు కుల మతాలకు అతీతంగా సమాజం కోసం పనిచేశారని తెలుపుతూ కొందరు మూర్ఖులు, అజ్ఞానులుగా మారారని ధ్వజమెత్తారు. 

తప్పు ఎత్తి చూపితే చాలు కులం, మతం, ప్రాంతం పేరు తెరపైకి తీసుకొస్తున్నారని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారు నియంతలా వ్యవహరిస్తున్నారని జేపీ మండిపడ్డారు. మద్దతుగా ఉంటే పూల బాట, ప్రత్యర్థిగా ఉంటే ముళ్ల మార్గంగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలదే అని చెబుతూ మన డబ్బు మన హక్కు అని వివరించారు. 

‘దేశానికి, ప్రజలకు మంచి జరగాలంటే ఆర్థిక ప్రగతి అవసరం. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రగతి మాట లేకుండా పోయింది. ఐదేళ్లలో ఏపీ పేరు దిగజారిపోయింది. పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితి వచ్చింది. దోపిడీ చేస్తూ.. సంక్షేమ పథకాలు అమలు చేశామని చెబుతున్నారు. ప్రజా పాలన ఇది కాదు అని’ జేపీ ధ్వజమెత్తారు.

ఒడిశా కన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారిందని జేపీ మండిపడ్డారు. ‘ఒడిశాలో రూ.26 వేల కోట్ల రెవెన్యూ ఉంది. అవసరం మేరకు అప్పులు చేస్తారు. హంగు లేదు. ఆర్బాటం లేదు. ప్రచారం అంతకన్నా లేదు. ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన సుపరిపాలన అందిస్తోంది’ అని గుర్తు చేశారు. 

సంస్కరణలు సాధ్యం కాదు అనేవారు అవినీతి పరులు, అసమర్థులని అంటూ జెపి ధ్వజమెత్తారు. వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి రెవెన్యూ పెంచుకోలేక పోయారు. కుల, మతం, హింస రాజ్యమేలిన ఉత్తర ప్రదేశ్ తీరు కూడా మారింది. ఏపీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారిందని జేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.