డీఎంకే మేనిఫెస్టోపై భ‌గ్గుమ‌న్న‌ బ‌స‌వ‌రాజ్ బొమ్మై

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు క‌ర్నాట‌క మాజీ ముఖ్యమంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై డీఎంకే ఎన్నిక‌ల మ్యానిఫెస్టోపై విమ‌ర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని ప్ర‌క్షాళ‌న చేయాల‌ని డీఎంకే కోరుకుంటోంద‌ని ఆరోపించారు. డీఎంకే వైఖ‌రిని ఇండియా విప‌క్ష కూటమి ప్ర‌ధాన భాగ‌స్వామి కాంగ్రెస్ స‌మ‌ర్ధిస్తోందా? అని బొమ్మై ప్ర‌శ్నించారు.

అసంబ‌ద్ధ హామీల‌ను డీఎంకే గుప్పిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఓ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బ‌స‌వరాజ్ బొమ్మై ఈ వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం య‌డియూర‌ప్ప‌, ఈశ్వ‌ర‌ప్ప‌ల మ‌ధ్య విభేదాలు లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మోదీ ప్ర‌భుత్వ ప‌నితీరుతో లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

ఇక రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు డీఎంకే మేనిఫెస్టోను త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ బుధ‌వారం విడుద‌ల చేశారు.  దీనితో పాటు ఎన్నికలకు అభ్యర్థుల జాబితానూ ప్రకటించారు. డీఎంకే తన మేనిఫెస్టోలో పలు వివాదాస్పద అంశాలు చేర్చింది. పుదుచ్చేరికి రాష్ట్ర హోదాతో పాటు నీట్‌పై నిషేధం విధిస్తామని హామీ ఇచ్చింది. గవర్నర్‌ పదవిని రద్దు చేసే వరకు రాష్ట్ర ముఖ్యమంత్రితో సంప్రదించి గవర్నర్‌ను నియమించాలని పేర్కొంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అయిన నీట్ ను నిషేధిస్తాం అని మేనిఫెస్టోలో వెల్లడించారు.

ఇతర హామీలు

  • పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలు, ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయబోం.
  • గవర్నర్లకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ నుంచి మినహాయింపు కల్పించే ఆర్టికల్ 361ను సవరిస్తాం.
  • తిరుక్కురళ్ ను ‘జాతీయ గ్రంథం’గా ప్రకటిస్తాం.
  • భారత్ కు తిరిగి వచ్చిన శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వం కల్పిస్తాం.
  • భారతదేశం అంతటా మహిళలకు నెలకు రూ .1000 డబ్బు అందిస్తాం.
  • జాతీయ రహదారిపై టోల్ గేట్లను తీసేస్తాం.
  • ఎల్పీజీ ధరను రూ.500లకు, పెట్రోల్ లీటర్ ధరను రూ.75 కు, డీజిల్ లీటర్ ధరను రూ.65కు తగ్గిస్తాం.
  • చెన్నైలో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు
  • జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి ) ఉపసంహరణ