తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె.అన్నామలై మాట్లాడుతూ రాష్ట్రానికి తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతోనే తమిళిసై తన పదవికి రాజీనామా చేశారని చెప్పారు. తమిళసై తీసుకున్న నిర్ణయం అంత సులువైనది కాదని చెబుతూ ఎన్డీయే 400కు పైగా సీట్లు గెలుచుకోబోతోందని, తమిళిసై రాజకీయాల్లో ఉండి బీజేపీకి సహకరించాలని అనుకుంటున్నారని చెప్పారు.
గవర్నర్ పదవికి రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించడంతో ఆమె మళ్లీ బీజేపీ క్యాడర్ లో చేరారని చెప్పారు. తమిళ ప్రజలను, బీజేపీ పార్టీని ఎంతగా ప్రేమిస్తుందో దీన్ని బట్టి అర్థం అవుతోందని చెప్పారు. పొత్తులు, సీట్ల పంపకాల కోసం ఐదు రోజులుగా చెన్నైలోనే ఉన్న కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆమెకు కమలం కండువా కప్పి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. తమిళసైకు ఎంతో పరిపాలనా అనుభవం ఉందని చెప్పారు. ఆమెను తిరిగి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు.
కాగా, దాదాపు 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్న తమిళిసై.. బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ చెన్నై పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆమెను కేంద్రం తెలంగాణకు గవర్నర్గా నియమించింది.
2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్గా తమిళిసై నియమితులయ్యారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రత్యక్ష రాజకీయాలంటే ఇష్టమున్న ఆమె.. లోక్సభ ఎన్నికలకు ముందు గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆమె తిరిగి బీజేపీలో చేరారు. తమిళనాడులోని చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకుడి ఎంపీ స్థానం నుంచి తమిళిసై పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
More Stories
అమిత్ షాకు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ కొత్త అస్త్రం