నియమావళిని ఉల్లంఘించిన వైసీపీ ఎమ్మెల్యేపై కేసు

* ప్రభుత్వ, వాణిజ్య స్ధలాల్లో రాజకీయ హోర్డింగ్లపై నిషేధం
 
ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకటేగౌడపై  వీకోట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఎన్నికల నియమావళి అమలులో ఉండగా ఎమ్మెల్యే ఫోటోలు ఉన్న ప్యాడ్లను విద్యార్థులకు అందించి వాటితో విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడంపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. 
 
ఇదే అంశాన్ని సోమవారం పలమనేర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో గమనించిన పరీక్షల పర్యవేక్షకులు పలమనేరు ఆర్డీవోకు నివేదిక అందించారు. మీడియాలో కథనాలు రావడంతో స్పందించిన ఎన్నికల కమిషన్ చర్యలకు ఆదేశించింది. ఈ మేరకు పలమనేరు అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో మనోజ్ రెడ్డి ఫిర్యాదు మేరకు వీకోట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 75 / 2024 గా పలమనేరు వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.
 
మంగళవారం కూడా వీకోట బాలిక బాలుర ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రం వద్ద ఎమ్మెల్యే చిత్రాలు ఉన్న ప్యాడ్లను అనుమతించాలంటూ పోలీసులు, డిప్యూటీ తాసిల్దార్ ఇతర రెవెన్యూ అధికారులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ అధికార పక్షం లెక్కచేయని పరిస్థితి. పరీక్ష కేంద్రం ముందు విద్యార్థులకు అసౌకర్యం కల్పిస్తూ అధికారులతో వైసీపీ వర్గీయులు దురుసుగా ప్రవర్తించారు. 
 
ఇదే విషయంపై ఎన్నికల కమిషన్ సీరియస్ కావడంతో పలమనేరు నియోజకవర్గంలోని ఎంఈఓలతో పాటు హెచ్ఎంలతో ప్రత్యేక వైర్లెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంత జరుగుతున్న పోలీసులు మాత్రం తమకేమీ తెలియదు అన్నట్లు పరీక్ష కేంద్రాల వద్ద హడావిడి చేస్తున్న వైసీపీ నేతలను వారించకుండా వదిలేయడం చర్చినీయాంశంగా మారింది.
 
ఇలా ఉండగా, రాష్ట్రంలోని ప్రభుత్వ, వాణిజ్య స్ధలాల్లో రాజకీయ హోర్డింగ్ లను అనుమతించరాదని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే రోడ్ల పక్కనున్న హోర్డింగ్ లను మాత్రం అన్ని రాజకీయ పార్టీలకు సమానంగా కేటాయించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకు అధికార పార్టీకి అనుకూలంగా హోర్డింగ్ లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్న మున్సిపల్, రెవెన్యూ అధికారులు, పోలీసులు ఇప్పుడు ఈసీ ఆదేశాలతో విపక్షాలకు కూడా తప్పనిసరిగా సమాన అవకాశం కల్పించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం జాతీయ, ప్రధాన రహదారుల ప్రక్కనున్న హోర్డింగులను అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాతిపదికన కేటాయించాలని సీఈవో ముకేష్ కుమార్ మీనా అధికారుల్ని ఆదేశించారు. కొత్త హోర్డింగులకు మాత్రం ఎలాంటి అనుమతులు ఇవ్వద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు తీరుపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

 
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోనున్న నేపథ్యంలో రాజకీయ ప్రకటనలు, పోస్టర్లు, హోర్డింగులు, బ్యానర్ల ప్రదర్శన విషయంలో జిల్లా ఎన్నికల అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్దంగా ఎటు వంటి రాజకీయ ప్రచారాన్ని అనుమతించవద్దని సూచించారు. ప్రైవేటు భవనాలపై వాల్ పెయింట్స్ కు ఎటువంటి అనుమతిలేదని, ఇప్పటికే ఉన్నవాటిని వెంటనే చెరిపేయాలని స్పష్టం చేశారు. 
 
ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు భవనాలపై ఇప్పటికే ఉన్న పెద్ద హోర్డింగులు, కటౌట్ల భద్రతను, నిర్మాణ స్థిరత్వాన్ని ఒక సారి పరిశీలించాలని, స్ట్రక్చర్ లో ఏమాత్రం దృడత్వం లేకపోయినా ప్రకటనలకు అనుమతించ వద్దని ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాల నుండి మద్యం, ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. 
 
సరిహద్దు ప్రాంతాల్లో శాశ్వత చెక్ పోస్టులు ఉన్న చోట వెబ్ కాస్టింగ్ ద్వారా నిఘా పెంచాలని పేర్కొన్నారు.  రాజయ పార్టీలు ఉద్యోగులకు, ఓటర్లకు నగదు, బహుమతులు వంటి తాయిలాల పంపిణీని తీవ్రంగా పరిగణించాలని చెప్పారు. సి-విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను నిర్ణీత సమయంలో వందశాతం పరిష్కరించాలని ఆదేశించారు.