సముద్రపు దొంగల ఆట కట్టించిన భారత నేవీ

భారత నేవీ మరోసారి సముద్రపు దొంగల ఆటలు సాగనివ్వలేదు. తమ ప్రాంతం ద్వారా ప్రయాణించే నౌకలను దోచుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలను అడ్డుకుంది. ఈ క్రమంలో భారత బలగాల వైపు పైరెట్లు కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలను భారత నేవీ సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ వీడియో సంచలనం సృష్టిస్తోంది. 

భారత నేవీ హెలికాప్టర్‌పై సముద్రపు దొంగలు తుపాకీతో దాడి చేస్తున్న సంఘటనకు సంబంధించిన వీడియో ఇది. బంగ్లాదేశ్‌కు చెందిన బల్క్ క్యారియర్ ఎంవీ రాయెన్ ఓడ 55,000 టన్నుల బొగ్గుతో మొజాంబిక్ రాజధాని మపుటో నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు బయలుదేరింది. 

మార్చి 12న సోమాలియా తీరంలో సాయుధులైన సోమాలియా సముద్రపు దొంగలు ఆ కార్గో షిప్‌పై దాడి చేశారు. అందులోకి చేరుకోవడంతోపాటు బంగ్లాదేశ్‌కు చెందిన 23 మంది సిబ్బందిని నిర్బంధించారు.  సముద్రపు దొంగల దాడి సందర్భంగా బంగ్లాదేశ్ షిప్ నుంచి అత్యవసర ఎస్‌ఓఎస్‌ సందేశం వచ్చింది.
దీంతో ఇండియన్‌ నేవీకి చెందిన యుద్ధ నౌక వెంటనే స్పందించింది. 

లాంగ్ రేంజ్ మారిటైమ్ పాట్రోల్ (ఎల్‌ఆర్‌ఎంపీ) విమానాన్ని రంగంలోకి దించింది. ఎంవీ అబ్దుల్లా కార్గో షిప్‌ను అది సమీపించింది. సాయుధులైన సముద్ర దొంగలు ఆ షిప్‌లో ఉన్నట్లు గమనించింది. సిబ్బంది పరిస్థితి గురించి తెలుసుకునేందుకు కమ్యూనికేషన్‌ కోసం ప్రయత్నించింది.

హైజాక్ అయిన ఆ కార్గో షిప్‌ను గుర్తించిన భారత నేవీ మార్చి 15న ఓ చాపర్‌ను పంపించింది. ఆ చాపర్‌పై సముద్రపు దొంగలు దాడికి దిగారు. ఓ పైరేట్ ఓడ నుంచి కాల్పులు జరపడం వీడియోలో కనిపిస్తోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆత్మరక్షణ కోసం సముద్రపు దొంగలను ఎదుర్కోవడం కోసం, వారిని నిర్వీర్యం చేయడం కోసం చాలా తక్కువ శక్తితో భారత నేవీ కాల్పులు జరిపింది. 

ఓడను విడిచిపెట్టాలని, బందీలుగా ఉన్న పౌరులను విడిచిపెట్టాలని భారత నేవీ సముద్రపు దొంగలను కోరింది. బంగ్లాదేశ్ జెండాతో ఉన్న కార్గోనౌకను ఇటీవల హిందూ మహాసముద్రంలో సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. ఈ నౌక మంగళవారం హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తుండగా, సముద్రపు దొంగలు అందులోకి చొరబడ్డారు. 

ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి నౌకను తమ నియంత్రణ లోకి తీసుకున్నారు. ఆ నౌక నుంచి వచ్చిన అత్యవసర సందేశంపై మన నౌకాదళం స్పందించింది. ఈ నేపథ్యం లోనే తాజా సంఘటన వెలుగు లోకి వచ్చింది.