ఏపీలో ఎస్పీలకు, ఉద్యోగులకు ఈసీ హెచ్చరిక

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందురోజు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఏర్పాట్లపై కీలక సమీక్ష జరిపిన సీఈవో ముకేష్ కుమార్ మీనా శుక్రవారం జిల్లా ఎస్పీలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈసారి రాష్ట్రంలో హింస, రీపోలింగ్ అవసరం లేని ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని  స్పష్టం చేశారు.  రాష్ట్రంలో ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా ఎస్పీలదే బాధ్యతని తెలిపారు.
హింసాత్మక ఘటనలపై వెంటనే చర్యలు తీసుకోకపోతే సదరు ఎస్పీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తద్వారా హింసను అరికట్టాల్సిందేనని తేల్చిచెప్పేశారు. మరోవైపు రాష్టంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గరి నుంచీ పెయిడ్ న్యూస్ పై ప్రత్యేక దృష్టి పెడతామని సీఈవో తెలిపారు.పార్టీ అనుబంధ ఛానళ్లలో అనుకూల వార్తలు వస్తే ఆ వ్యయాన్ని సదరు పార్టీ, అభ్యర్ధుల ఖాతాల నుంచే చేసిన వ్యయంగా భావిస్తామని పెర్కోన్నారు.
 
ఎంసీఎంసీ కమిటీలు ఈ తరహా వార్తలను, ప్రచారాలను నిశితంగా పరిశీలన చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకూ అన్ని రాజకీయ పార్టీల నుంచి 155 ప్రకటనల కోసం ఈసీకి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఎమ్మెల్యేకు రూ. 40 లక్షలు, ఎంపీ అభ్యర్ధికి రూ. 95 లక్షల వ్యయాన్ని మాత్రమే ఈసీ ఎన్నికల వ్యయంగా అనుమతించిందని సీఈవో తెలిపారు. 
 
నామినేషన్ల చివరి తేదీ నుంచి అభ్యర్ధుల ఎన్నికల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ ప్రచారంలో పాల్గోనకూడదని సర్వీసు నిబంధనల్లోనే ఉందని పేర్కొంటూ అలాంటి ఉదంతాలు వస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.