ఎన్నికలతో తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు బ్రేక్‌

కలియుగ వైకుంఠం తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రెటీలు పోటెత్తుతారు. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే స్వామివారిని దర్శించుకోవడానికి సర్వదర్శనం, ఉచిత దర్శనం, స్పెషల్ దర్శనం, వీఐపీ బ్రేక్‌ దర్శనం.. ఇలా పలు మార్గాల్లో వెంకన్నను దర్శనం చేసుకుంటారు. 
 
అయితే తాజాగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు టీటీడీ బ్రేక్‌ వేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతి రోజు సర్వ దర్శనం, ఆర్జిత సేవలు, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు, వీఐపీ దర్శనాలు ఉంటాయి. ముఖ్యంగా  రాజ్యాంగ బద్ధ హోదాలో ఉన్న వ్యక్తులు, ప్రముఖులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వారి పరివారంతో వీఐపీ బ్రేక్, శ్రీవారి ఆర్జిత నిత్య సేవల్లో పాల్గొంటూ ఉంటారు.
 
అందులోనూ ప్రజాప్రతినిధులు, వారి అనుచరవర్గానికి, నియోజకవర్గాల ప్రజలకు సిఫార్సు లేఖలపై తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందుతుంటారు. ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రతి రోజు ఉదయం సమయంలో ఉంటుంటాయి. ప్రముఖుల నుంచి తీసుకుని వెళ్లే సిఫార్సు లేఖలను భక్తులు ముందు రోజు తిరుమలలోని అడిషనల్ ఈవో కార్యాలయంలో దర్శనం కోసం అభ్యర్థన పెట్టుకోవాల్సి ఉంటుంది. 
 
ఆ తర్వాత టీటీడీ అధికారులు భక్తుల రద్దీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దర్శనాలకు స్లాట్‌లు కేటాయిస్తారు. ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, కేంద్రమంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫార్సులపై వీఐపీ బ్రేక్ దర్శనాలు జారీ చేస్తుంటారు. ఇటు తెలంగాణ ప్రజా ప్రతినిధులకు కూడా వీఐపీ దర్శనాల కోటా ఉంటుంది. 
 
అయితే త్వరలో జరిగే ఏపీలో అసెంబ్లీ, దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి శనివారం ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. దాంతో నేటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్లు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ప్రజాప్రతినిధులుకు ఇప్పటికే సమాచారం అందించింది టీటీడీ. 
 
నేడు  ఎన్నికల నోటిఫికేషన్‌ రానుండడంతో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరణను రద్దు చేసింది టీటీడీ. అయితే..  సిఫార్సు లేఖలు అనుమతించనప్పటికీ  ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా వస్తే మాత్రం బ్రేక్ దర్శనం కల్పిస్తారు