దిగుమతి చేసుకునే విద్యుత్ కార్లపై పన్ను తగ్గింపు

 
* కొత్త ఇవి పాలసీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం
 
ఎలక్ట్రిక్ వాహనాల (ఇవి)కు తయారీ గమ్యస్థానంగా భారత్‌ను ప్రోత్సహించేందుకు గాను కొత్త ఇవి పాలసీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పాలసీతో అమెరికన్ ఇవి దిగ్గజం టెస్లాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఇవి వాహనాల సంస్థలకు భారత్‌లో ఎంట్రీకి లైన్ క్లియర్ కానుంది.
 
కొత్త ఇవి విధానంలో భారతదేశానికి విదేశీ పెట్టుబడులను తీసుకురావడంపై అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాకుండా ఇవి టెక్నాలజీ ఉత్పత్తిలో భారతదేశాన్ని అగ్రగామిగా మార్చడానికి కూడా ప్రయత్నాలు చేశారు. ఈ కొత్త ఈవీ విధానంతో విదేశీ ఎలక్ట్రిక్ కార్ల తయారీదారులు భారతదేశంలోకి ఎగుమతి చేసే ఎలక్ట్రిక్ వాహనాలపై తక్కువ దిగుమతి పన్ను సుంకాలు ఉండనున్నాయి.
 
భారతదేశంలో దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ కార్లపై పన్ను ప్రయోజనాన్ని పొందడానికి మార్గదర్శకాలు, అర్హతలను వివరిస్తూ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మార్చి 15న నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త ఈవీ విధానం  లోని ముఖ్యాంశాలు:.

  • భారతదేశంలో కనీసం రూ .4,150 కోట్లు పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉన్న ఏ ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి పన్ను తగ్గింపు లభిస్తుంది.
  • అయితే, ఆయా సంస్థలు మూడు సంవత్సరాల లోపు భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రారంభించాల్సి ఉంటుంది.
  • ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు విదేశాల నుంచి సంవత్సరానికి గరిష్టంగా 8,000 ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే భారతదేశానికి తీసుకురావాల్సి ఉంటుంది.
  • అర్హత ప్రమాణాల్లో భాగంగా, ఈవీ తయారీదారు కార్లను తయారు చేయడానికి స్థానిక మార్కెట్ల నుండి 35 శాతం విడి భాగాలను ఉపయోగించాలి. ఈ తయారీదారులు ఐదేళ్లలో దేశీయ విలువ జోడింపు (డీవీఏ) లో 50 శాతానికి చేరుకోవాల్సి ఉంటుంది.
  • ఎలక్ట్రిక్ వాహనాల ధరలు 35,000 డాలర్లు (సుమారు రూ.29 లక్షలు) మించకుండా ఉంటే వీటిపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి తగ్గించనున్నారు.
  • ప్రస్తుతం భారత్ కు తీసుకువచ్చే ఎలక్ట్రిక్ కార్లపై కేంద్రం 70 నుంచి 100 శాతం దిగుమతి పన్ను వసూలు చేస్తోంది.

భారత్ కొత్త ఈవీ విధానాన్ని ప్రకటించడంతో టెస్లా వంటి విదేశీ కార్ల తయారీ సంస్థలు ఇండియాలో ఈవీల ఉత్పత్తిని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అమెరికాకు చెందిన ఈవీ తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు గత కొన్నేళ్లుగా తక్కువ దిగుమతి పన్ను కోసం లాబీయింగ్ చేస్తోంది. 

ఈ దిశగా కొంత కాలంగా కంపెనీ, కేంద్రం మధ్య వివిధ స్థాయిల్లో చర్చలు కూడా జరిగాయి. ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి పన్నును తగ్గించవద్దని, స్థానిక తయారీదారులకు సమాన అవకాశాలు కల్పించాలని భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ గతంలో కేంద్రాన్ని కోరింది.

ప్రధాని మోదీతో మస్క్ భేటీ

టెస్లా సీఈఓ, వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా, భారతదేశంలో టెస్లా కార్ల ఉత్పత్తిని ప్రారంభించడానికి ఆయన మరోసారి ఆసక్తి చూపారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా యూఎస్ లోని టెస్లా ఫెసిలిటీని సందర్శించారు. 

అమెరికాకు చెందిన ఈవీ తయారీ సంస్థ టెస్లా గ్లోబల్ మార్కెట్లో మోడల్ 3, మోడల్ ఎస్, మోడల్ వై, మోడల్ ఎక్స్ వంటి అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తోంది.