ఆదాయం పన్ను శాఖ చర్యపై కాంగ్రెస్ కు చుక్కెదురు

తమ బ్యాంకు ఖాతాలపై ఆదాయ పన్ను శాఖ(ఐటి) తీసుకున్న చర్యపై స్టే ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభ్యర్థనను ఐటి అపెల్లేట్ ట్రిబ్యునల్ శుక్రవారం కొట్టివేసింది. తమ బ్యాంకు ఖాతాల నుంచి రూ.65 కోట్లను ఐటి శాఖ అప్రజాస్వామికంగా ఉపసంహరించిందని కాంగ్రెస్ ఆరోపించింది. తమ బ్యాంకు ఖాతాలపై ఐటి శాఖ తీసుకున్న చర్యను నిలుపుదల చేయాలని కోరుతూ కాంగ్రెస్ చేసుకున్న విజ్ఞప్తిని ట్రిబ్యునల్ కొట్టివేసింది. 

అయితే తాము హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులపై కనీసం 10 రోజులు స్టే ఇవ్వాలని కాంగ్రెస్ కోరగా ఈ అభ్యర్థనను కూడా ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. 2018-19 మదింపు సంవత్సరానికి చెందిన పన్ను క్లెయిములకు సంబంధించి ఐటి శాఖతో కాంగ్రెస్‌కు వివాదం ఏర్పడింది.

 తొలుత రూ. 103 కోట్ల క్లెయిములు దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత దాన్ని రూ. 105 కోట్లకు సవరించింది. అయితే వడ్డీగా చూపిన రూ. 30 కోట్ల క్లెయిమ్‌ను రూ. 135 కోట్లకు కాంగ్రెస్ పెంచింది. వివిధ బ్యాంకులలో ఉన్న తమ ఖాతాల నుంచి రూ. 65 కోట్లను ఐటి శాఖ అప్రజాస్వామికంగా ఉపసంహరించిందని ఆరోపిస్తూ ఆదాయ పన్ను అపెల్లేట్ ట్రిబ్యునల్(ఐటిఎటి) వద్ద గత బుధవారం కాంగ్రెస్ అప్పీలు దాఖలు చేసింది. 

ఫిబ్రవరి 16న కాంగ్రెస్‌కు చెందిన ప్రధాన బ్యాంకు ఖాతాలను ఐటి శాఖ స్తంభింపచేసింది. అయితే..తదురి విచార జరిగే వరకు బ్యాంకు ఖాతాలను నిర్వహించేందుకు అనుమతినిస్తూ అపెల్లేట్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ అపెల్లేట్ టిబ్యునల్ వద్ద అప్పీలుకు వెళ్లింది.  100 సంవత్సరాల పార్టీ అయిన తాము క్రమం తప్పకుండా ఐటి రిటర్న్‌లు దాఖలు చేస్తున్నామని, ఎన్నికలు జరగనున్న సమయంలో ఈ విధమైన చర్య తీసుకోవడం తాము ఎన్నికలలో పాల్గొనకుండా అడ్డుకోవడమేనని కాంగ్రెస్ ఆరోపించింది. 

ఈ చర్య ద్వారా తమ గొంతు నొక్కుతున్నారని కాంగ్రెస్ తరఫున హాజరైన న్యాయవాది ట్రిబ్యునల్ కోర్టులో తెలిపారు. దీనికి ఐటి శాఖ సమధానమిస్తూ ఎన్నికల ముందు తమను లక్ష్యంగా చేసుకున్నారంటూ కాంగ్రెస్ తప్పుడు వాదన వినిపిస్తోందని పేర్కొంది. అయితే, బ్యాంకు అకౌంట్లను ఆపరేట్ చేసుకునేందుకు ఐటీఏటీ కాంగ్రెస్‌కు అనుమతి ఇచ్చినట్టు వివేక్ తన్ఖా ఆ తరువాత వివరణ ఇచ్చారు. ఐటీ శాఖ సైతం కాంగ్రెస్ బ్యాంకు అకౌంట్ల లావాదేవీలను స్తంభింపజేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది.