జాతీయ రాజకీయాల్లో తగ్గుతున్న తెలుగువారి ప్రభావం

జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర ప్రస్తుతం కనిపించడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మన మనుగడకు, గుర్తింపుకు ఇది మంచి పరిణామం కాదన్నారు. గతంలో సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. 
 
ఆ తర్వాత జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు ఆ స్థాయిని కొంతవరకు నిలబెట్టారని చెప్పారు. మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృ ద్ధి సంస్థలో తమిళనాడు మాజీ గవర్నర్, మాజీ డి జిపి పిఎస్ రామ్మోహన్ రావు రచించిన ‘గవర్నర్‌పేట్ టు గవర్నర్ హౌస్’ పుస్తకాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
 
జాతీయ స్థాయిలో హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అని చెబుతూ జాతీయ రాజకీయాల్లో కూడా ఆ స్థాయి ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేంద్ర కేబినెట్లో మనవాళ్లను వెతికి చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. మన ప్రాంతానికి సంబంధించిన అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రస్తావించాలన్నా మాట్లాడే నేతలు కనిపించడం లేదని విచారం వ్యక్తం చేశారు.
 
మనవాళ్లుగా మనమంతా కలిసి ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.  ‘మీలాంటి అనుభవజ్ఞుల నుంచి మా ప్రభుత్వం సూచనలు తీసుకుంటుంది. గతంలో నంద్యాలలో పివి పోటీ చేసినపుడు, తెలుగువాడు ప్రధానిగా ఉండాలని ఎన్‌టిఆర్ పివిపై తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టకుండా ఏకగ్రీవం చేసే ప్రయత్నం  చేశారు’ అని ఆయన గుర్తు చేశారు. 
 
రాజకీయాల్లో అప్పుడప్పుడు ఒక మంచి సంప్రదాయాన్ని పాటించడంలో తప్పులేదని అంటూ తమ ప్రభుత్వం కూడా అలాంటి మంచి సంప్రదాయాన్ని పాటిస్తుందని చెప్పారు. రాష్ట్రాలుగా విడిపోయినా మనుషులుగా మనం కలిసి ఉండాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ అంశాలు వచ్చినపుడు ఎలాం టి ఆలోచన చేయాలి, ప్రాంతీయ అంశాలు వచ్చినపుడు ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలనే విచక్షణ ఉండాలని తెలిపారు.