ఓటర్లకు రాజకీయ పార్టీలను హామీలపై నిలదీసే హక్కు

* ఒకే దశలో ఎన్నికలు నిర్వహించామని కోరుతున్న పార్టీలు

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇచ్చే పలు రకాల హామీలు, తాయిలాలు, వాగ్దానాలపై నిలదీసే అధికారం, హక్కు ఓటర్లకు ఉందని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సిఇసి) రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. పార్టీలు వెలువరించే హామీల అమలు సాధాసాధ్యాలపై పౌరులు ప్రశ్నింవచ్చునని, ఇది వారి తిరుగులేని హక్కు అని ఆయన శనివారం తెలిపారు.

 అయితే సంబంధిత విషయం ఇప్పుడు న్యాయస్థానం విచారణ పరిధిలో ఉన్నందున దీనిపై ఎక్కువగా ప్రస్తావించలేనని చెప్పారు. తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల నిర్వహణ సంసిద్ధత సమీక్షకు చెన్నైకు వచ్చిన సిఇసి విలేకరుల సమావేశంలో మాట్డుతూ ఎన్నికలలో పాల్గొనే వివిధ రాజకీయ పార్టీలకు ప్రచార దశలో హామీలు వెలువరించే హక్కు ఉందని తెలిపారు.

అయితే వారు చెప్పే మాటలలో ఎంత మేరకు విశ్వసనీయత ఉంది? భారీ వ్యయం భారపు తాయిలాల అమలు ఏ విధంగా చేస్తారని నిలదీసేందుకు పౌరులకు స్వేచ్ఛ ఉందని కూడా రాజీవ్‌కుమార్ తెలిపారు. పలు పార్టీలు అనేక పథకాలను ప్రకటిస్తూ ఉంటాయి. అయితే వీటికి నిధుల లభ్యత ఏ విధంగా జరుగుతుందనేది కీలక ప్రశ్న అవుతుంది. 

ఈ కోణంలోని పలు అంశాల వ్యాజ్యం ఇప్పుడు కోర్టు విచారణ పరిధిలో ఉందని గుర్తు చేశారు. పార్టీలు చేసే ఎన్నికల వాగ్దానాల విషయాలపై ఎన్నికల సంఘం కూడా కన్నేసి ఉంచుతోందని చెప్పారు. దీనికి సంబంధించి పార్టీల ముందుకు ప్రోఫార్మాను పంపించడం జరుగుతోందని తెలిపారు.

ప్రచారాలలో చేసే వాగ్దానాలను ఏ విధంగా అమలు చేస్తారనేది పార్టీలు ఈ నిబంధనావళి మేరకు సంక్షిప్తంగా తెలియచేయాల్సి ఉంటుంది అని సిఇసి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇవన్నీ కూడా కోర్టు వ్యాజ్యాల పరిధిలోని అంశాలుగా మారాయని చెపుతూనే ఎన్నికల ప్రధానాధికారి తమ సంఘం స్పష్టమైన వైఖరిని వివరించారు.

ఎన్నికల దశల్లో పార్టీలు ప్రకటించే ఉచితాలు, రాయితీల వ్యవహారంపై ఎప్పటికప్పుడు నిశిత పర్యవేక్షణ సాగించాలని తాము చట్టపరమైన సంస్థలకు ఆదేశాలు వెలువరించామని సిఇసి తెలిపారు. ఇక ఓటర్లను ఆకట్టుకునేందుకు నగదు పంపిణీలపై కూడా నిఘా ఉంటుంది. ప్రత్యేకించి ఆన్‌లైన్ చెల్లింపుల ప్రక్రియ ఇటీవలి కాలంలో జోరందుకుంటున్నందున దీనిని నిశితంగా గమనించాల్సి ఉందని తాము నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పిసి)కి సూచించినట్లు తెలిపారు. వారి నివేదిక మేరకు ఈ విషయంలో తమకు సరైన అవగావహన వెలువడుతుందని చెప్పారు.

ఎన్నికలకు ముందు, మధ్యలో తలెత్తే తీవ్రసమస్య ఫేక్ న్యూస్. తప్పుడు వార్తలతో జనాలను పక్కదోవపట్టించడం జరుగుతోంది. చివరికి ఇటీవలే దేశంలో లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించారనే తప్పుడు వార్త వైరల్ అయింది. ఇది కొంత మేరకు ప్రజలను అయోమయంలోకి నెట్టింది. అయితే ఎన్నికల సంఘం ఈ ఫేక్‌న్యూస్‌పై వెనువెంటనే స్పందించింది. 

అరగంటలోనే ఇదంతా బూటకపు వార్త అని వివరణతో ముందుకు వచ్చిందని రాజీవ్‌కుమార్ తెలిపారు. కేవలం ఎన్నికలే కాకుండా ఇతరత్రా కూడా తప్పుదోవ పట్టించే వార్తలు ముప్పు తెచ్చిపెడుతాయని ఆయన హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికలను ఒకే దశలో నిర్వహించాలని పలు పార్టీలు కోరాయని సిఇసి తెలిపారు. 

తాను వివిధ రాజకీయ పార్టీలతో ఇక్కడ సమాలోచనలు జరిపానని, ఈ దశలో అత్యధిక పార్టీలు పలు దశల పోలింగ్ ప్రక్రియ రాజకీయ కాకను పెంచుతుందని, పైగా కొన్ని పార్టీలు తమ సాధన సంపత్తిని ఓటర్లను ప్రలోభాలతో ఆకట్టుకునేందుకు వీలు కల్పించినట్లు అవుతుందని, పైగా జనం తీర్పు చాలా రోజులు తేలని విధంగా ఉత్కంఠతకు దారితీస్తుందని వారు తనతో తెలిపారని వివరించారు. 

ఓటర్లకు డబ్బుల పంపిణికి పార్టీలు నిధులు సమకూర్చుకుని ఉన్నాయని తనకు విదితం అయిందని పేర్కొన్నారు. తాను ఇక్కడ బిజెపి, కాంగ్రెస్, అన్నాడిఎంకె, డిఎంకె ఇతర పార్టీల నేతలతో మాట్లాడానని, పలువురు తనతో సింగిల్ ఫేజ్ సరిపోతుందని చెప్పారని , డబ్బుల పంపిణీ, తాయిలాల కట్టడి అవసరం అని సూచించారని తెలిపారు. మరి ఈ మాటలను వాస్తవికంగా వారు ఏ విధంగా ఆచరణలో పెడుతారనేది వారి చర్యలను బట్టి నిర్థారణ అవుతుందని చెప్పారు.

కాగా, ఎన్నికల ప్రచారసరళిని ఇంటర్నెట్ ఆన్‌లైన్ ప్రక్రియ వచ్చి సరికొత్త మార్పు దిశలోకి తీసుకువచ్చింది. ఓటర్ల ఐడి కార్డుల తారుమారు, తప్పుడు ఓట్లు, రిగ్గింగ్‌లకు ఆన్‌లైన్ సాంకేతికను వాడుకుంటున్నారని పార్టీలు తెలిపాయని చెప్పిన సిఇసి పార్టీలకు తెలియకుండా ఇటువంటి జరిగేందుకు వీలుంటుందా? అని సందేహం వ్యక్తం చేశారు.

 ఆన్‌లైన్ పద్ధతిలో మద్యం పంపిణి, డబ్బులు ఖాతాల్లోకి చేరేలా చేయడం వంటి పరిణామాలను పార్టీలే తమ దృష్టికి తీసుకువచ్చాయని చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా ఇతరత్రా లేదా నేరుగా ఓటర్లకు నగదు, అనేక రకాల సెంటిమెంట్ గిఫ్ట్‌లు ఇవ్వడం వంటి వాటి గురించి గత ఎన్నికల దశల్లో తమిళనాడు రాజకీయ పార్టీలు పరస్పరం నిందలకు దిగిన విషయాన్ని ఈ సందర్భంగా సిఇసి ప్రస్తావించారు.