కాంగ్రెస్ పార్టీ అంటేనే బంధు ప్రీతి, అవినీతి

కాంగ్రెస్ పార్టీ అంటేనే బంధు ప్రీతి, అవినీతిలకు కేరాఫ్ అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. దేశాభివృద్ధి ఆ పార్టీ అజెండాలోనే లేదని ధ్వజమెత్తారు. వీక్షిత్ భారత్, వీక్షిత్ ఛత్తీస్‌గఢ్ కార్యక్రమంలో భాగంగా రాయ్‌పుర్‌లో పర్యటించిన ప్రధాని రూ.34,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ  ‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక చాలా ఏళ్లు కాంగ్రెస్ పాలించింది. ఆ పార్టీ దృష్టి ఎప్పుడూ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంపైనే ఉండేది. దేశ భవిష్యత్తుపై ఆ పార్టీ నాయకులకు పట్టింపు లేదు. కాంగ్రెస్ ఎప్పుడూ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకుంది’ అని తెలిపారు.

ఇప్పటికీ కాంగ్రెస్ దశ, దిశ మారలేదు. బంధుప్రీతి, అవినీతి, అలకలు, బుజ్జగింపులు ఇవి తప్ప వేరే విషయాలు ఆలోచించదని ప్రధాని విమర్శలు గుప్పించారు.  ‘కాంగ్రెస్ నేతలు, వారి కుమారులు, కుమార్తెల రాజకీయ భవిష్యత్తును రూపొందించడంలో బిజీగా ఉన్నారు. పేద ప్రజల కుమారులు, కుమార్తెల గురించి వారు ఎప్పుడూ ఆలోచించరు’ అని చెప్పారు. 

`దేశ ప్రజలంతా మోదీ కుటుంబ సభ్యులు. అందుకే దేశ అభివృద్ధి గురించే నేను, మా పార్టీ నేతలు మాట్లాడుతుంటారు. పేదలు, యువత, మహిళా సాధికారతతోనే అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించవచ్చు. ఛత్తీస్‌గఢ్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పథకాన్ని నిలిపేసింది. మా ప్రభుత్వం ఆ పనుల్ని వేగవంతం చేసింది’ అని మోదీ పేర్కొన్నారు. 

భారత్ రానున్న ఐదు సంవత్సరాలలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారినప్పుడు ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిలో కొత్త శిఖరాలు అందుకుంటుందని ఆయన సూచించారు. ప్రగతిశీలక ఛత్తీస్‌గఢ్‌ను నిరుపేదలు, యువత, మహిళల సాధికారతతో నిర్మించవచ్చునని ఆయన సూచించారు. తనను ప్రజల సేవకునిగా మోదీ పేర్కొంటూ, 140 కోట్ల మంది భారతీయులకు తన నిబద్ధతను, శ్రమను గ్యారంటీగా ఇచ్చినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్, మంత్రులు పాల్గొన్నారు.