బీజేపీ ఎంపీగా పోటీ చేయ‌నున్న సినీ న‌టి శోభ‌న‌!

సినీ న‌టి శోభ‌న రాజ‌కీయ ప్రవేశం చేయనున్నారు. కేర‌ళ నుంచి ఆమె పోటీ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. తిరువ‌నంత‌పురం లోక్‌స‌భ స్థానానికి ఆమె పోటీ ప‌డే అవకాశం ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫిబ్ర‌వ‌రి 27వ తేదీన కేర‌ళ‌లో జ‌ర‌గ‌నున్న బీజేపీ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని నరేంద్ర మోదీ పాల్గోన‌నున్న కార్యక్రమంలో ఆమె బీజేపీలో చేరే అవకాశాలున్నాయి
 
తిరువ‌నంత‌పురం నియోజ‌క‌వ‌ర్గం ఎంపీ శ‌శిథ‌రూర్‌ను ఢీకొట్టేందుకు శోభ‌న‌ను రంగంలోకి దించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆయన ఆ స్థానం నుండి వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. అయితే ఇదే స్థానం నుంచి కేంద్ర‌మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్‌, న‌టుడు సురేశ్ కుమార్ కూడా బీజేపీ నుంచి పోటీ ప‌డే అవకాశం ఉన్న‌ట్లు కూడా కధనాలు వెలువడుతున్నాయి. 
 
అయితే ఎక్కువ శాతం మాత్రం న‌టి శోభ‌న‌కే ఆ స్థానం నుంచి సీటు ద‌క్కే అవ‌కాశాలు ఉన్న‌ట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇటీవ‌ల త్రిసూర్‌లో జ‌రిగిన బీజేపీ మ‌హిళా మీట్‌లోనూ శోభ‌న పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో దిగిన ఓ ఫోటోను కూడా ఆమె పోస్ట్ చేశారు. కేరళలో ఈ పర్యాయం ఎట్లాగైనా మొదటిసారిగా ఓ లోక్ సభ సీటు గెలుపొందాలని చూస్తున్న బీజేపీ తిరువంతపురంపై దృష్టి సారిస్తోంది.