ఆలయాలపై `పన్ను’ బిల్లుకు మండలిలో చుక్కెదురు

కర్ణాటకలో దేవాలయాల ఆదాయంపై 10 శాతం పన్ను విధించే బిల్లుకు సిద్ధరామయ్య సర్కారు శాసనసభలో పొందగలిగిన శాసనమండలిలో వీగిపోయింది. మండలిలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా 38, అనుకూలంగా 30 ఓట్లు వచ్చాయి. మొత్తం 75 సభ్యులున్న మండలిలో ఎన్డీఏ పక్షాలైన బీజేపీకి 35, జేడీఎస్‌కి 8 మంది, కాంగ్రెస్‌కు 30 మంది, ఒక్క ఇండిపెంట్ ఉండగా.. ఒక్క సీటు ఖాళీగా ఉంది. 
 
దీంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ‘కర్ణాటక హిందూ మత సంస్థలు, ధార్మిక ఎండోమెంట్ సవరణ బిల్లు 2024’ను బీజేపీ అడ్డుకుంది. దీనిపై తీవ్ర ఆరోపణలు గుప్పించిన ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్‌ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపణలు చేసింది. ఈ బిల్లు ద్వారా సిద్ధరామయ్య సర్కార్ ఖజానాను నింపుకోవాలని చూస్తోందని మాజీ సీఎం యడియూరప్ప విమర్శలు చేశారు.

‘హిందూ వ్యతిరేకులం మేము కాదు. అది బీజేపీయే. ఈ చట్టం 2003లో అమలులోకి వచ్చింది. 2011లో వారు కొన్ని సవరణలు చేశారు. ఆ సమయంలో రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న 34 వేల ఆలయాలు ఉన్నాయి. కానీ, ధార్మిక పరిషత్‌కు ఒక్క పైసా కూడా విదిల్చిందిలేదు’ అని 
రవాణా మంత్రి రామలింగారెడ్డి తెలిపారు.
`రూ.5 నుంచి రూ.10 లక్షలు మధ్య ఆదాయం ఉన్న 194 బి గ్రేడ్ ఆలయాల నుంచి 5 శాతం, రూ.10 లక్షలు దాటిన 205 ఆలయాల నుంచి 10 శాతం వసూలు చేయడానికి అప్పట్లో సవరణలు చేశారు.ఈ లెక్కన ఎవరు హిందూ వ్యతిరేకులు?’ అని ప్రశ్నించారు.  ఆరోగ్య మంత్రి దినేశ్ గుండూరావు మాట్లాడుతూ చిన్న దేవాలయాలకు తమ ప్రభుత్వం సాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటే, బీజేపీ తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ బిల్లు దేవాలయాల ప్రయోజనాల కోసమేనని బీజేపీ గ్రహించాలని ఆయన హితవు పలికారు.
 
అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కేవలం హిందూ దేవాలయాలను మాత్రమే ఎందుకు పరిశీలిస్తున్నారని, ఇతర మతాల ఆదాయాలను ఎందుకు పరిశీలించడం లేదని ప్రశ్నించారు. దీనిపై సిద్ధరామయ్య స్పందిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే లక్ష్యంతో రాజకీయ ప్రయోజనాల కోసమే మతాలను ప్రస్తావన తీసుకొస్తున్నారని మండిపడ్డారు.