ఆ సిరీస్ ముందుగా సీబీఐకి చూపించాలన్న కోర్టు

సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసుపై రూపొందించిన ‘ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్’ డాక్యుమెంటరీ సిరీస్ విషయంలోనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు ప్రత్యేక కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా తాజాగా బాంబే హైకోర్టు స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చే ముందు సీబీఐ అధికారులకు నెట్‍ఫ్లిక్స్ చూపించాలని కీలక ఆదేశాలు ఇవ్వడంతో ఈ సిరీస్ వాయిదా పడింది.
 
ఈ సిరీస్ ఫిబ్రవరి 23న  నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా ఫిబ్రవరి 29 వరకు స్ట్రీమింగ్ చేయబోమని నెట్‍ఫ్లిక్స్ చెప్పింది. ఆరోజున విచారణ తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. షీనా బోరా హత్య కేసుపై రూపొందించిన ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్ డాక్యు సిరీస్ స్ట్రీమింగ్‍ను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో రాకుండా ఆపాలని ముందుగా ముంబైలోని ప్రత్యేక కోర్టుకు సిబిఐ వెళ్లింది. 
 
అయితే, అలా ఆదేశించేందుకు తమకు అధికారులు లేవని ఆ న్యాయస్థానం చెప్పింది. దీంతో బాంబే హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది. ఈ విషయంలో వాదనలు వినే ముందు సీబీఐ ప్రతినిధులకు ఈ సిరీస్ స్క్రీనింగ్ చేయాలని న్యాయమూర్తులు జస్టిస్ రేవతి మోహితే, జస్టిస్ మంజూషా దేశ్‍పాండేలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

అందుకు తొలుత నెట్‍ఫ్లిక్  అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఆ తర్వాత అంగీకరించింది.  షీనా బోరా కేసు విచారణ దశలో ఉందని, తరుణంలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయితే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని సీబీఐ వాదిస్తోంది. ఈ సిరీస్‍లో నిందితులతో పాటు కేసుతో సంబంధం ఉన్న వారి, కొందరి సాక్ష్యుల ఇంటర్వ్యూలు ఉన్నట్టు ట్రైలర్‌తో తెలుస్తోందని, అందుకే దీన్ని ఆపాలని కోరింది. 

దీంతో ఈ సిరీస్‍లో ఎంత మంది సాక్షుల ఇంటర్వ్యూలు ఉన్నాయో చెప్పాలని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీని కోర్టు ఆదేశించింది. మొత్తంగా ముందుగా ఈ సిరీస్‍ను సీబీఐ అధికారులకు చూపాలని చెప్పింది. హైకోర్టు, సిబిఐ అధికారులు, న్యాయవాదుల సమక్షంలో ప్రదర్శించాలని తెలిపింది.

2012లో తన కూతురు షీనా బోరాను హత్య చేశారన్న అభియోగాలతో ఇంద్రాణి ముఖర్జియా 2015లో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఆమె మాజీ భర్త సంజీవన్ ఖన్నా, తదుపరి భర్త పీటర్ ముఖర్జియా, డ్రైవర్ శ్యాంవర్ రాయ్ కూడా అరెస్ట్ అయ్యారు. గతేడాది మేలో ఇంద్రాణికి బెయిల్ వచ్చింది. మిగిలిన వారు కూడా బెయిల్‍పై బయట ఉన్నారు.