సింహాలకు అక్బర్, సీత పేర్లపై హైకోర్టు అభ్యంతరం

బెంగాల్ సఫారీ పార్కులోని ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచిన అక్బర్ అనే మగ సింహానికి, సీత అనే ఆడ సింహానికి పేర్లు మార్చాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు గురువారం ఆదేశించింది. మీ ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు జంతువుకు హిందూ దేవతల పేరో లేదా ముస్లిం మతగురువు పేరో మీరు పెడతారా? అని ప్రభుత్వ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది.

సీత, అక్బర్ అనే పేర్లు గల రెండు సింహాలను ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచాలన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశ్వ హిందూ పరిషత్(విహెచ్‌పి) దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ కొనసాగించిన సింగిల్ జడ్జి బెంచ్ జస్టిస్ సౌగత భట్టాచార్య దేశంలో అత్యధిక శాతం మంది ప్రజలు సీతాదేవిని ఆరాధిస్తారని తెలిపారు. 

అక్బర్‌ను లౌకిక ముఘల్ సామ్రాజ్యాధినేతగా అభివర్ణించారు. మనలో ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఆ సింహాలకు అక్డర్, సీత అని పేర్లు పెట్టి ఉండేవారం కామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ అని ఏ జంతువుకైనా పేరు పెట్టాలని ఎవరైనా ఆలోచిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ దేశంలో అత్యధిక శాతం మంది ప్రజలు సీతను కొలుస్తారని ఆయన చెప్పారు. 

అలాగే సమర్థుడు, విజేత, లౌకికవాదిగా ముఘల్ చక్రవర్తి అక్బర్‌కు మంచి పేరు ఉందని తెలిపారు. తాను కూటా ఈ రెండు సింహాలకు ఆ పేర్లను పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నానని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఆ రెండు సింహాలకు త్రిపుర  జూపార్కు అధికారులు 2016, 2018లో పేర్లు పెట్టారని, ఇటీవలనే బెంగాల్ సఫారీ పార్కుకు వాటిని తరలించారని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫు న్యాయవాది న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. 

బెంగాల్‌కు చేరుకున్న తర్వాత ఈసింహాల పేర్లు వివాదంగా మారాయని అదనపు అడ్వకేట్ జనరల్ దేబ్‌జ్యోతి చౌదరి తెలిపారు. ఒక జంతువుకు దేవుడి పేర్లు, పౌరాణిక పాత్రల పేర్లు, లేదా స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు ఎందుకు పెట్టాలని న్యాయమూర్తి ప్రశ్నించారు. 

జూ శాఖలోని ఒక అధికారి పెంపుడు జంతువుల పేర్ల గురించి తాము మాట్లాడటం లేదని, ఒక సంక్షేమ, లౌకిక రాష్ట్రానికి చెందిన మీరు సింహాలకు సీత, అక్బర్ అని పేర్లు పెట్టి ఎందుకు వివాదం సృష్టిస్తున్నారని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ సింహాలకు బిజిలీ లేదా అటువంటిదే మరో పేరు పెట్టవచ్చు కదా అని కూడా ఆయన సూచించారు.