
* బైజూస్ సీఈవో కోసం ఈడీ లుకౌట్ నోటీసు
లిక్కర్ స్కామ్ గా పేరొందిన ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఏడో సారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 26 న తమ ముందు హాజరుకావాలని ఆ సమన్లలో ఈడీ కేజ్రీవాల్ ను ఆదేశించింది. ఈడీ ఇప్పటివరకు పంపిన ఆరు సమన్లను అరవింద్ కేజ్రీవాల్ పట్టించుకోలేదు.
ఆ సమన్లు చట్టవిరుద్ధమని, అందువల్లనే కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదని ఆప్ వాదిస్తోంది. ఈడీ కూడా కేజ్రీవాల్ ను పదేపదే హాజరుకావాల్సిందిగా కోరకుండా కోర్టు నిర్ణయం కోసం వేచి చూడాలని ఆప్ వ్యాఖ్యానించింది.
‘‘ఈడీ నుంచి వచ్చిన సమన్లన్నింటికీ మేం సమాధానం ఇచ్చాం. చివరగా ఫిబ్రవరి 17 న సీఎం అరవింద్ కేజ్రీవాల్ వర్చువల్ గా కోర్టులోనే ఉన్నారు. తదుపరి విచారణను కోర్టు మార్చి 16కు వాయిదా వేసింది. మేము చట్టాన్ని పాటించే వ్యక్తులం. కోర్టు ఏం చెబితే అది పాటిస్తాం. ఈ కేసులో కోర్టు ఇచ్చే తీర్పు కోసం ఈడీ వేచిచూడాల్సింది. కోర్టు తీర్పు రాకముందే, సమన్లు పంపడం కోర్టు ధిక్కారమే’’ అని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ధ్వజమెత్తారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రచారం చేయకుండా ఉండేందుకు ఆయనను అరెస్టు చేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ యోచిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది. తాము పంపిస్తున్న సమన్లను కేజ్రీవాల్ పట్టించుకోకపోవడంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది.
పీఎంఎల్ఏ సెక్షన్ 50కి అనుగుణంగా తమ ముందు కేజ్రీవాల్ హాజరు కానందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 190 (1)(ఎ), 200, ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 174, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) సెక్షన్ 63(4) కింద ఈడీ కేసు నమోదు చేసింది. దీనిపై ఫిబ్రవరి 17న రౌస్ అవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
More Stories
భారత్ లో ఓటింగ్ను పెంచేందుకు అమెరికా నిధులు?
లడ్డూ కల్తీ నెయ్యి సూత్రధారుల కోసం ఇక వేట
అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత