గద్దర్ ఎలా ఆదర్శ మవుతాడు?

వుప్పల నరసింహం, సీనియర్ జర్నలిస్ట్.

జనవరి 31, 2024న ‘గద్దర్ ఫౌండేషన్’ హైదరాబాద్ లో గద్దర్ జయంతి సభను నిర్వహించింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్
రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఏడాది (2025) నుంచి గద్దర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం
అధికారికంగా జరుపుతుందని ప్రకటించారు. తన మాటే జి.ఓ. అని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో గద్దర్ గూర్చి కొంత నిష్పక్షపాత వైఖరితో మాట్లాడుకోవలసిన అవసరం ఉంది. 

కొన్ని విషయాలు, అభిప్రాయాలు కొందరికి నచ్చకపోవచ్చు. అంత మాత్రాన సత్యం, నిజం తెరమరుగు కారాదు కదా?  వాస్తవానికి గద్దర్ తన జీవితంలో సింహభాగం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసించలేదు. పైగా పార్లమెంట్ ఒక పందుల దొడ్డి, అసెంబ్లీ ఒక బాతాఖానీ క్లబ్ అంటూ అగౌరవపరుస్తూ, దూషిస్తూ వేలాది వేదికలపై మాట్లాడాడు, పాటలు పాడాడు. 
 
పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూకటి వేళ్ళతో పెకలించి నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం మావోయిస్టుల ఆధ్వర్యంలో కదం తొక్కాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ విప్లవం తుపాకి గొట్టం ద్వారానే సాధ్యమని, అందుకే సాయుధంగా తిరగబడమని దశాబ్దాలపాటు ఆయన సాంస్కృతికోద్యమం
చేశాడు. 
 
తెలుగు నేలపైనే కాక ఇతర ప్రాంతాల్లోను మావోయిస్టులతో కలిసి ప్రచారం చేసిన విషయమూ అందరికీ తెలుసు. దేశమంతా కలియతిరిగి ప్రజాస్వామ్య ప్రక్రియపై నిప్పులు చెరిగాడు. పాటను ఒక అస్త్రంగా మలుచుకొని ఆటపాటతో అనేకమందిని ఆకర్షించాడు. అంతేగాక మావోయిస్టులతో కలిసి కొంతకాలం అజ్ఞాత జీవితం- గెరిల్లా జీవితం గడిపాడు.
 
వేలాది మంది యువతీ యువకులను అజ్ఞాత-గెరిల్లా జీవితం గడిపేందుకు గాను అడవుల్లోకి ఆహ్వానించాడు. ఆయనపై గల గురి, నమ్మకంతో అనేకమంది అడవులకు వెళ్ళారు. ఇదంతా జగమెరిగిన సత్యం. ఎన్నికైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు సహచర మావోయిస్టులతో కలిసి ఆయన ‘కుట్ర’ చేశాడు. ఆయనపై నమోదైన అనేక కేసులు ఇందుకు సాక్ష్యం.
 
అలాంటి గద్దర్ మావోయిస్టుల ప్రతినిధిగా గత కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చలు జరిపి మావోలకు ఎంతో మేలు చేకూర్చి, వారి బలోపేతానికి అవిశ్రాంతంగా శ్రమించిన వ్యక్తి, కళాకారుడు ఇప్పుడు ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వానికి ఎలా ఆదర్శప్రాయుడవుతాడు? ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపేందుకు ఎలా నిశ్చయిస్తుంది? ఇది కోటి రూకల ప్రశ్న. ఆరోగ్యకర ఆలోచనలు చేసేవారికి ఆశ్చర్యం కలిగించే అంశం.

డా॥ వై.యస్. రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వంతో పీపుల్స్ వార్ (మావోయిస్టు పార్టీ పూర్వ నామం) జరిపిన చర్చలు విఫలమయ్యాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా అలజడి సృష్టించి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని గద్దర్ తీవ్రంగా దూషించిన విషయం విస్మరించరానిది. అంతటి ఘన చరిత్ర గల గద్దర్ ను వర్తమాన కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకత్వం ఆదర్శంగా భావించడం ఆశ్చర్యకరంగా, ఆందోళనకరంగాను ఉంది. 

కవి-గాయకునిగా గద్దర్ బావుకత, కళానైపుణ్యం, రసజ్ఞత, విశిష్టత గొప్పదే. దాన్ని అభిమానించాలి. అంతేగాని అవి ఉన్నాయని ఉన్నత పీఠం ఎక్కించి ఆదర్శప్రాయుడని తలవడం సమంజసం అవదు. ఆదర్శం వేరు, అభిమానం వేరు. ఆ స్పష్టత ఉండాలి. ఎవరైనా తరతరాలు గుర్తుంచుకోదగ్గ రీతిలో
నిస్వార్ధంగా ప్రజలకు సేవలు అందించినప్పుడే, బోధించేవి ఆచరించినప్పుడే ఆదర్శప్రాయులని పించుకుంటారు. 
 
ఈ కొలబద్ద… కొలమానంతో చూస్తే గద్దర్ ఎక్కడా నిలవడు. ఆ విధంగా ఆయనను తిలకించలేం. ఆయనను కేవలం అభిమానించగలం. అంతేగాని ఆదర్శవంతునిగా, గొప్ప త్యాగధనుడిగా, త్యాగపురుషునిగా పరిగణించలేం. ఆయన జీవనయానాన్ని నిశితంగా పరిశీలిస్తే ఈ విషయాలన్ని స్పష్టంగా తెలుస్తాయి. 
 
కళను విప్లవీకరించి, విప్లవ రాజకీయాలతో మిళితం చేసి మావోయిస్టుల (అప్పటి పీపుల్స్ వార్)తో ప్రయాణం కొనసాగించినా అక్కడ అనేక ఆరోపణల కారణంగా రెండుసార్లు గద్దర్ బహిష్కరణకు గురైన సంగతి విస్మరించరాదు. అతనిలోని దురాశ అత్యాశ, క్రమశిక్షణా రాహిత్యానికి తార్కాణమే ఆ తీవ్రమైన ‘వేటు’ అన్న విషయం విప్లవ అభ్యుదయ కాములందరికి తెలుసు.
 
అనంతరం పార్టీ బహిష్కరణను ‘పాజిటివ్’ గా భావించేవారిని, ఆయనకు ‘విముక్తి’ అభించిందని భావించే వారిని, తన అభిమానులను పోగేసి దగ్గరకు తీశాడు. తన పాటకు, మాటకు తిరుగులేదని నిరూపించేందుకు గాను బుల్లెట్ మార్గాన్ని వీడి, బ్యాలెట్ బాటను ఎంచుకున్నాడు. తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందన్న నినాదాన్ని అటకెక్కించి ఓటు ద్వారా విప్లవం తీసుకొస్తానని, భావ విప్లవం తీసుకొస్తానని సంకల్పం చెప్పుకున్నాడు.
 
అందులో భాగంగా ఆయన ప్రయాణం రకరకాల ‘సర్కస్ ఫీట్ల’ ను తలపించింది. ఏకంగా దక్షిణాది రాష్ట్రాలలో ఓట్ల సునామి తీసుకొస్తానని, జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న బడుగు బలహీన, దళిత బహుజనులను ఏకం చేసి సరికొత్తగా లాల్-నీల్ మార్గంలో రాజ్యాధికారాన్ని కైవశం చేసుకుంటామని సదస్సులు- సభలు నిర్వహించాడు. అవసరమైన కార్యాచరణకు రూపకల్పన
చేశాడు.
 
ఈ విషయం కూడా అందరికి తెలుసు. ఆయన సన్నిహితులకు ఈ విషయం మరింత ఎక్కువగా తెలుసు. ఆఖరికి ‘భారత రాష్ట్రపతి’ పదవి కోసం పావులు కదిపిన సంగతి సైతం సకల జనులకు తెలుసు. కానీ ఎక్కడా విజయం సాధించలేదు. ఆఖరికి మునుగోడు శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను కె.ఎ. పాల్ సారధ్యంలోని ‘ప్రజాశాంతి పార్టీ’లో చేరాడు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని మీడియా ముందు ప్రకటించాడు. 
 
చివరి దశలో కూడా నామినేషన్ వేయకుండా, కె.ఎ. పాల్ కు కనిపించకుండా ఆయన అజ్ఞాతంలోకి జారుకున్నాడు. కొన్నాళ్ళకు తానే స్వయంగా ‘గద్దర్ ప్రజాపార్టీ’ అన్న పేర భారత ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు మీడియా ముందు ప్రకటించాడు. అప్పటివరకు గద్దర్ పాల్ నేతృత్వంలోని పార్టీకి రాజీనామా సమర్పించకపోవడంతో ఆయన తన పార్టీ నుంచి గద్దర్ ను బహిష్కరించినట్టు ప్రకటించాడు. ఆ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి. రకరకాల వ్యాఖ్యలు వెలువడ్డాయి. 
 
పరిణామాలు, పద్ధతులు, వ్యవహారాలు, విధానాలు ఏ మాత్రమైన గౌరవప్రదమైనవిగా కనిపిస్తున్నాయా? లేదుగాక లేదు. మరి అలాంటి వ్యక్తిత్వం, అధికార లాలస, పెత్తనం చలాయించాలనే తత్వం, ఏ రకంగానైనా సరే ‘చక్రం’ తిప్పాలన్న తాపత్రయం ఎంత వరకు ఆమోదయోగ్యమవుతుంది? ఇట్లా ఎక్కడా నిలకడలేనితనంతో పాటు నిజాయితీని సైతం సమాధి చేసిన ఘన చరిత్ర ఆయనది. 
 
ఆయన జీవన మలుపులు నిండా ఇవే అసంబద్ధ వ్యవహారాలు దర్శనమవుతాయి. చివరికి తాను రాజకీయ నాయకుడిగా ప్రకాశించలేకపోయినా తన పుత్రరత్నం సూర్యాన్ని రాజకీయ నాయకుడిగా చేసేందుకు ఆయన పడిన తాపత్రయం, హైరానా ఇంతా అంతా కాదు. దీన్ని పరిశీలించిన వారందరు ఆనాడు ముక్కున వేలేసుకున్నవారే.
అలాగే గద్దర్ చేసిన ప్రబోధాలకు, ఆచరణకు, వాటిపట్ల ఆయనకున్న నిబద్ధతను గూర్చి కొన్ని విషయాలు ముచ్చటించుకోవాలి. సమాజంలోని సమస్యలన్నింటికి మూలకారణం ‘సొంత ఆస్తి’ అన్న కార్ల్ మార్క్స్ మాటను, కమ్యూనిస్టు-మావోయిస్టుల వాక్కును ఆయన గట్టిగా బలవరుస్తూ దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా పాటలు-పద్యాలు పాడిన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టుల ఆ మూల సిద్ధాంతంవైపు ప్రజల్ని ఆకర్షించి ఉద్యమం వైపు కదిలేలా అహరహం పని చేశాడు.
 
సొంత ఆస్తి రద్దు సిద్ధాంతాన్ని ప్రచారం చేసి చివరికి ఆయన పెద్దఎత్తున స్థిర చరాస్థులను పోగేశాడు. కార్పొరేట్ స్థాయి మహాబోధి విద్యాలయ పాఠశాలను నెలకొల్పాడు. మరి ఇదెలా నిబద్ధతతో కూడిన ఆచరణ అనిపించుకుంటుంది? ఇది అందరు నిశితంగా ఆలోచించాల్సిన విషయమే కదా? చెప్పేమాటకు, చేతకు పొంతన ఉన్నప్పుడే కదా ఎవరి వ్యక్తిత్వమైనా వెలుగొందుతుంది. అప్పుడే కదా అందరూ అలాంటి వ్యక్తిని ఆదర్శంగా భావిస్తారు?
 
గద్దర్ సమకాలికుడు, అదే సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ కవి గూడ అంజయ్య రాసిన ‘ఊరు మనదిరా… ఈ వాడ మనదిరా… అన్న పాట గద్దర్ కు అపారమైన కీర్తి ప్రతిష్టలను గౌరవాన్ని తెచ్చి పెట్టింది. ఆ పాట రాసిన అంజయ్యకు మాత్రం ఎక్కడా గౌరవం దక్కలేదు. గద్దర్ సమకాలీకులైన కవుల, కళాకారుల ఆస్తులు ఏమాత్రం పెరగలేదు. గద్దర్ ఆస్తులు మాత్రం బాగా పెరిగాయి. ఇది ఎలా జరిగింది? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గదా?
 
ఇక్కడే తిరకాసు ఉంది, మతలబు ఉంది. మరి అలాంటి వ్యక్తి ఆదర్శప్రాయుడు ఎలా అవుతాడు? ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూత లూగించిన మరో కవి అందెశ్రీ. ఆయన రాసిన ‘జయ జయ జయహే తెలంగాణ’ అన్న గీతం ఇప్పుడు రాష్ట్ర అధికార గీతంగా గౌరవం పొందింది. అదో అలాంటి కవి గాయకుడి సొంత ఆస్తి ఏ మేరకు ఎగబాకింది? గద్దర్ సొంత ఆస్తి తారాజువ్వలా ఎలా దూసుకుపోయింది?
 
అటు విప్లవ గేయాలతో గూడ అంజయ్య, ఇటు తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాత్ర అపూర్వమైనది కాదని ఎవరైనా అనగలరా? వారు నిస్వార్థంగా, నిజాయితీగా, నిండు హృదయాలతో, నిబద్ధతతో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉద్యమ సాహిత్యాన్ని సృష్టించి తెలంగాణ నేలను పావనం చేశారు. నిష్కామకర్మగా కృషి చేశారు. వారి సాధారణ-సామాన్య జీవితం ఆదర్శ మవుతుందా? లేక ఆర్భాటం చేస్తూ ఆటపాటలతో ఆకర్షించి మాయచేసి చెప్పేదానికి, మాయచేసి, చెప్పేదానికి, చేసే దానికి పొంతనలేని రీతిలో జీవితం గడిపిన గద్దర్ ఆదర్శప్రాయుడౌతాడా? 
 
ఎవరికి వారే ఆలోచించుకొని సమాధానం చెప్పుకోవాలి. మతం మత్తుమందు అన్న మార్క్, మావోల మాటను భారతదేశంలో బలంగా ప్రచారం
చేసి, సాంస్కృతిక కార్యక్రమాలు ఇచ్చి, హిందూ దేవుళ్ళను దూషించి, సత్యసాయిబాబా లాంటి వారిని పరుషంగా విమర్శించిన గద్దర్ తన పార్టీ తనను బహిష్కరించాక ‘తత్త్వం’ బోధపడి రకరకాల గుళ్ళు, గోపురాల చుట్టూ తిరిగాడు. పూజలు చేసి మొక్కులు మొక్కుకున్నాడు. ఆశువుగా పాటలు పాడి స్తోత్రాలు చేశాడు. ఈ విషయం అందిరికీ తెలుసు. 
 
మరి ఇది భక్తి అనుకుందామా? అవకాశవాదం అనుకుందామా? సకల సౌకర్యాలు అమర్చుకునేందుకు వేసిన ‘ఎత్తుగడ’ అనుకోవాలా? ఈ అధ్యాయం తరువాతనే ఆయన తన రాజకీయ ‘సెకండ్ ఇన్నింగ్స్’ ను ప్రారంభించడం గమనార్హం. పైగా ఇదంతా ప్రజల అభీష్టం మేరకేనని పెద్ద బుకాయింపు సదా సిద్ధంగా ఆయన నోట ఉండేది. 
 
ఇలా అనేక ద్వంద్వ ప్రమాణాలను, దోషాలను తెలివిగా పాటల, చరణాల దరువుల మాటున దాచేశాడు. ఆ నైపుణ్యం ఆయనలో పుష్కలంగా కనిపించింది. ప్రజాబాహుళ్య చైతన్యానికి విరుద్ధంగా తిరుగుబాటు, హక్కుల సాధన పోరాటం పేరిట కమ్యూనిజం-మావోయిజం పల్లెపల్లెన పరిఢవిల్లాలని పాదాలకు గజ్జెకట్టి నర్తనమాడిన గద్దర్ గత చరిత్రను, హింసాత్మక భావజాలాన్ని అంతా ఎర్రతివాచీ కిందకు తోసేసి ప్రభుత్వం ఇప్పుడు ఆయనను ఆదర్శంగా చిత్రీకరించడం, అధికారికంగా జయంతిని నిర్వహిస్తామనడం, చిత్రంగా విచిత్రంగా ఉంది.
 
వివిధ సమయాల్లో, సందర్భాల్లో విప్లవకారుల, వారి మద్దతుదారుల మాటలు ఎంతో ఆకర్షణీయంగా, స్ఫూర్తి కలిగించేలా అద్భుతంగా ఉండడం సహజమే. అలాగని వారు ప్రజాప్రభుత్వానికి అది ఆదర్శం కాదు కదా! విప్లవకారులతో మిత్ర వైవిధ్యం కాదు, శత్రు వైవిధ్యం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ప్రజలచే ఎన్నికయిన రాజ్యం వేరు, విప్లవకారులు తిరుగుబాటు తత్త్వం వేరు. ఈ స్పష్టత ఖచ్చితంగా పాలకులకు ఉండాలి. ఆ విచక్షణ కొరవడితే ప్రజాస్వామ్యం కంగాలీగా మారుతుంది.
 
విప్లవకారులు ఎప్పుడూ ఎన్నికయిన ప్రభుత్వాలను సాయుధంగా కూల్చేందుకు కుట్ర చేస్తారన్న ఎరుక సైతం పాలకులకు ఉండాలి. అర్ధ శతాబ్దానికి పైగా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ వేదికలపై గోచి, గొంగడి ధరించి ప్రజల నుంచి అపార సానుభూతి, ఆర్ధిక సాయం పొంది, తన శ్రావ్యమైన గొంతుతో పండిత-
పామరులను ఆకర్షించి అందుకు కాంట్రాస్టు (పరస్పర విరుద్ధంగా) గా జీవితం కొనసాగించిన గద్దర్ ఆదర్శప్రాయుడెలా అవుతాడు? 
 
ఆయన సాహిత్యం, సాంస్కృతిక ప్రదర్శనలు అవురూపం. అందరూ సలాం చేయవల్సిందే. కానీ అది అభిమానం వరకు మాత్రమే పరిమితమైతే మెరుగ్గా   ఉంటుంది. ఆ పరిధి దాటితే వెగటు కలిగిస్తుంది. నిజానికి పాలకులు భావోద్రేకాలకు, భావోద్వేగాలకు అతీతంగా, వాటికి గురి కాకుండా ‘రాజధర్మం’పై దృష్టి సారించి ప్రజా సంక్షేమానికి, వారి అభివృద్ధికి పాటుపడాలి. ఇది అనాదిగా వస్తున్న రివాజు. ఆ పరిధి దాటితే సహజంగానే విమర్శ, రాజ్యంపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
 
హేతుబద్ధమైన ఈ తర్కాన్ని పరిశీలిస్తే గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తామనడంలో పాలకుల తొందరపాటు నిర్ణయం స్పష్టాతిస్పష్టంగా వెల్లడవుతుంది కదా?  మరోమాట, గద్దర్ రాజకీయ గురువు ప్రముఖ నక్సలైటు నాయకుడు కొండపల్లి సీతారామయ్య, (కొండపల్లి సీతారామిరెడ్డి-కె.ఎస్.) అన్న విషయం ప్రపంచమంతటికి తెలుసు. గద్దర్ ఆట- పాటలోని వాడి వేడి అంతా కె.ఎస్.దే. ఈ సంగతి సైతం జగద్విదితమే. 
 
కొండపల్లి లేనిదే గద్దర్ లేడన్నది కూడా సత్యమే. కొండపల్లి సీతారామయ్య కృష్ణాజిల్లాకు చెందిన వాడయినప్పటికీ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సద్దుమణిగాక, 1971-72 లో తిరిగి ముల్కి- ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది ఆయనే. గద్దర్ ప్రజా సాంస్కృతిక-రాజకీయ జీవితం అక్కడే అప్పుడే ఆరంభమైంది. కె.ఎస్. కనుసన్నల్లోనే ఆయన రాజకీయ పాఠాలు వల్లెవేశాడు. పాటకు రాజకీయ పరిమళం అద్దాడు. 
 
తెలంగాణ ఉద్యమంతో పాటు నక్సలైటు ఉద్యమాన్ని కొండపల్లి సీతారామయ్య ‘జమిలి’గా నడిపాడు. ఆ రెండింటిలోను గద్దర్ పాత్ర గణనీయమైనది. నక్సలైటు ఉద్యమం ఉధృతం కావడంతో తెలంగాణ గ్రామాలు, పల్లెలోని దొరలను పట్టణాలకు తరిమి వారి భూములను ప్రజలు స్వాధీనం చేసుకొనే కార్యక్రమానికి కొండపల్లి సీతారామయ్య ముఖ్య కారకుడు, ఆ రకంగా తెలంగాణలో సామాజిక రాజకీయ చైతన్యానికి కె.ఎస్. కేంద్రబిందువు. 
 
తెలంగాణ ప్రజల సాధికారతకు పాటుపడిన నాయకుడు ఆయన. మరణానంతరం కూడా ఆయన ప్రభావం తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది, ఆదో ఆ కొండపల్లి సీతారామయ్య జయంతి, వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్న అభ్యర్ధన, డిమాండ్ అందితే ముఖ్యమంత్రి-రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా?
 
ఎలాంటి విజ్ఞాపనలు, అభ్యర్ధనలు, డిమాండ్ లేకుండానే గద్దర్ జయంతి నుంచి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించినప్పుడు గద్దర్ కన్నా
గురువు కొండపల్లి అందుకు అర్హుడని అన్ని వివరాలు, డాక్యుమెంట్లు అందిస్తే 
రాష్ట్ర ప్రభుత్వం సమ్మతిస్తుందా? జయంతి, వర్ధంతులను నిర్వహిస్తుందా?
కొసమెరుపు ఏమిటంటే అరబిక్ భాష నుంచి ఉర్దూలోకి వచ్చిన గద్దర్ అన్న పదానికి నిఘంటువులో అర్ధం వెతికితే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ
ఆశ్చర్యం కలుగుతుంది. ఆ అర్ధం స్ఫురించే వ్యక్తి ఆదర్శం ఎలా అవుతాడని అందరూ నిర్ఘాంత పోవడం ఖాయం.