కర్ణాటకకు కుదిపేస్తున్న రేవణ్ణ సెక్స్ వీడియోలు

కర్ణాటకకు కుదిపేస్తున్న రేవణ్ణ సెక్స్ వీడియోలు
కర్నాటకలో రెండో దశ లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక సెక్స్‌ స్కాండల్‌ కలకలం రేపుతోంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు, ఎన్‌డిఎ కూటమికి మధ్య హోరాహోరీగా పోరు జరుగుతున్న నేపథ్యంలో ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షమైన జెడి(ఎస్) ఎంపి, మాజీ ప్రధాని దేవెగౌడ మనువడు ప్రజ్వల్ రేవణ్ణ , ఆయన తండ్రి మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ హెచ్‌డి రేవణ్ణపై దేశమంతా ఉలిక్కిపడేలా సెక్స్ స్కాండల్ బయటపడింది. 
 
ప్రత్యేకించి ప్రజ్వల గత కొన్నేళ్ళుగా తన రాజకీయ అధికారం, పలుకుబడి ఉపయోగించి వందలాది సెక్స్ వీడియోలు తీశారని, ఈ రాక్షసంలో వెయ్యి మంది దాకా మహిళలు బాధితులుగా ఉన్నారని దాని తాలూకు అశ్లీల వీడియోలు ప్రజ్వల్ రేవణ్ణ ఎన్నిక రోజునే బయటపడ్డాయి. ఈ వీడియోలు ఎన్నికల ముందు ఎవరు బయటపెట్టారనే విషయమై ఎన్‌డిఎకు, కాంగ్రెస్‌కు మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతున్నది.
 
ప్రధాన నిందితుడు జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ, రెండో నిందితుడు ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణలకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సమన్లు జారీచేసింది. 24 గంటల్లోగా ఎస్పీ సీమా లాట్కార్‌ ముందు హాజరుకావాలని ఆదేశించింది. కాగా, తనపై వస్తున్న ఆరోపణలపై ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ తొలిసారి స్పందించాడు. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించాడు. 
 
‘సిట్‌ ముందు హాజరుకావడానికి 7 రోజుల సమయం కావాలి. ఇప్పుడు నేను బెంగళూరులో లేను’ అంటూ ‘ఎక్స్‌’లో సందేశాన్ని పోస్ట్‌ చేశాడు. సెక్స్‌ స్కాండల్‌ వెలుగులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ డిప్లొమాటిక్‌ పాస్‌పోర్ట్‌ ఉపయోగించి ఏప్రిల్‌ 28న జర్మనీ పారిపోవటం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. అతడి పాస్‌పోర్ట్‌ రద్దు చేసి, ప్రజ్వల్‌ను భారత్‌కు రప్పించటంలో సాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోరారు.

33 ఏళ్ళ యువకుడైన రేవణ్ణ హాసన్ నియోజకవర్గానికి ఎంపిగా ఉండి తిరిగి ఎన్‌డిఎ కూటమి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. రేవణ్ణకు ఓటు వేయాలని ప్రధాని మోదీ  నియోజకవర్గంలో ప్రచారం చేశారు. మహిళల జీవితాలతో ఆడుకున్న రేవణ్ణకు ఎలా మద్దతు ఇచ్చారని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నది. 

అధికారంలో ఉన్న కాంగ్రెస్ రేవణ్ణపై ఎందుకు చర్య తీసుకోలేదని, ఆయన జర్మనీకి పారిపోయే దాకా ఎందుకు ఉపేక్షించారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. తాము మహిళలకు నిజమైన రక్షకులుగా ఉన్నామని రేవణ్ణపై ఆధారాలుంటే కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని ఆ ప్రభావం తమ పార్టీపై పడకుండా అమిత్ షా సెక్స్ స్కాండల్‌పై ప్రతిస్పందించారు. 

రేవణ్ణ ఘాతుకాలకు బలైన ఒక మహిళ చేసిన ఫిర్యాదుపై మొత్తం రేవణ్ణ బండారం బయటపడింది. దీనిపై కర్నాటకలోని సిద్ధ రామయ్య ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వీడియోలు అసలైనవి అవునా, కావా అని వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్ పరిశీలనకు పంపారు. మరోవైపు ఆ వీడియోల్లో బాధితులైన మహిళలను గుర్తించి వారి సాక్షాలు తీసుకొనే ప్రయత్నంలో ఎస్‌ఐటి టీం ముందుకు కొనసాగుతున్నది.

అవన్నీ మార్ఫ్‌డ్ వీడియోలు అని వాటితో తనకు సంబంధం లేదని ప్రకటించిన ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ నుంచి ఎక్స్‌లో స్పందించారు. కాని ప్రజ్వల్ రేవణ్ణ ఈ మహా ‘డర్టీ పిక్చర్’లో అమాయకుడైతే ఎందుకు దేశం విడిచి పారిపోవాలని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నది. పారిపోతుంటే అధికారంలో ఉన్న మీరేం చేస్తున్నారని బిజెపి అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది. 

మరోవైపు ఈ మొత్తం సెక్స్ స్కాండల్ బయటపడగానే నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కెఆర్ శివకుమార్ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాని ఈ ఆరోపణల్లో భాగస్వామిగా ఉన్న ఆయన తండ్రి హెచ్‌డి రేవణ్ణపై జెడి(ఎస్) ఎలాంటి చర్య తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది. కర్నాటక రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న జెడి(ఎస్)కు రేవణ్ణ ఉదంతం పెద్ద మచ్చగా భావించక తప్పదు.

వెయ్యి మంది మహిళలను లైంగికంగా లోబర్చుకుని వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేయడమనే విషయం సాధారణం కాదు. ఇంతగా బరి తెగించిన యువ నేత రేవణ్ణకు ఎలాంటి శిక్ష వేసినా తక్కువేనని మహిళా బాధితులు అంటున్నారు.

‘ఎంపీ ప్రజ్వల్‌పై లైంగిక నేరాలు, అతడు ఎలాంటి వాడన్నది బీజేపీ నాయకుడు దేవరాజే గౌడ 2023 డిసెంబర్‌లోనే బయటపెట్టారు. అతడ్ని కూటమి అభ్యర్థిగా నిలబెట్టవద్దంటూ ప్రధాని మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డాలకు మెయిల్స్‌, లేఖలు పంపాడు’ అని  కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేథ్‌ తప్పుబట్టారు. . అయితే లైంగిక వేధింపుల గురించి తమ పార్టీ నేత తనకు లేఖ రాశాడన్న ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ఖండించారు.