మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ఇంట్లో సీబీఐ సోదాలు

జమ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జలవిద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టుకు సంబంధించిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ గురువారం ఉదయం ఢిల్లీతోపాటు వివిధ పట్టణాల్లో ఆయనకు సంబంధించిన 30 చోట్ల దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో సుమారు 100 మంది అధికారులు పాల్గొన్నారు.

ఆయన గవర్నర్‌గా ఉన్న కాలంలో రూ.2,200 కోట్ల విలువైన కిరు హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ ప్రాజెక్టు (హెచ్ ఇ పి) నిర్మాణపనులకు సంబంధించిన అనుమతుల విషయంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై 2022, ఏప్రిల్‌ నెలలో సత్యపాల్‌ మాలిక్‌ సహా ఐదుగురిపై సీబీఐ కేసు నమోదుచేసింది. 

2018, ఆగస్టు 23 నుంచి 2019, అక్టోబర్‌ 30 వరకు ఆయన జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తన వద్దకు రెండు దస్త్రాలు వచ్చాయని, వాటిపై సంతకం చేస్తే రూ.300 కోట్లు వస్తాయని తన కార్యదర్శులు చెప్పినట్లు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అందులో ఒక దస్త్రం హైడ్రో ప్రాజెక్టుదని ఆయన తెలిపారు.

కాగా, సీబీఐ సోదాలపై సత్యపాల్‌ స్పందిస్తూ తాను అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ తన నివాసంపై నిరంకుశ శక్తులు దాడులు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సోదాల ద్వారా తన డ్రైవర్, సహాయకుడిని అనవసరంగా వేధిస్తున్నారని విమర్శించారు. దాడులకు తాను భయపడేది లేదని, రైతుల పక్షాన నిలబడతానని స్పష్టం చేశారు. 

ఈ చర్యలు తనను నిలువరించలేవని సామాజిక వేదిక ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా చెప్పారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ఢిల్లీలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. గతంలో ఓ బీమా పథకం ఒప్పందానికి చెందిన అవినీతి కేసులో సీబీఐ.. మాలిక్‌ను సాక్షిగా 5 గంటల పాటు విచారించింది.