మే 20 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యూడీషియల్​  కస్టడీ మంగళవారంతో ముగియగా అధికారులు తిహార్​ జైలు నుంచి వీడియోకాన్ఫరెన్స్​ ద్వారా హాజరుపరిచారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నందున రిమాండ్​ పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. దర్యాప్తు సంస్థ విజ్ఞప్తి మేరకు ఈ నెల 20 వరకు కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఢిల్లీ లిక్కర్​ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్​ను పరిగణలోకి తీసుకునే అంశంపై రౌజ్‌ అవెన్యూ కోర్టు విచారించింది. 8 వేల పేజీల సప్లిమెంటరీ ఛార్జిషీట్​ను ఈడీ దాఖలు చేసినట్లు తెలిపింది. దీన్ని పరిగణలో తీసుకునే అంశంపై ఈ నెల 20న విచారణ చేస్తామని పేర్కొంది.

న్యాయమూర్తి కావేరీ బవేజా సోమవారమే దీనిపై విచారణ చేపట్టాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఇవాళ్టికి వాయిదా వేశారు. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్​లో గోవా ఆప్‌ అసెంబ్లీ ప్రచార వ్యవహారాలు చూసిన చారియట్‌ ప్రొడక్షన్స్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉద్యోగులు దామోదర్‌ శర్మ, ప్రిన్స్‌కుమార్‌, చన్‌ప్రీత్‌ సింగ్‌తోపాటు, ఇండియా ఎహెడ్‌ వార్తా ఛానల్‌ మాజీ ఉద్యోగి అర్వింద్‌సింగ్‌లనూ నిందితులుగా చేర్చింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. జ్యుడీషల్ కస్టడీలో భాగంగా ఆమెను తీహాడ్​ జైల్‌లో ఉంచారు. జ్యుడీషియల్ ఖైదీగా ఉన్న సమయంలోనే ఏప్రిల్‌ 11వ తేదీన సీబీఐ ఆమెను అరెస్ట్‌ చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత ప్రస్తుతం రిమాండ్‌లో కొనసాగుతున్నది.

కేసు విచారణ జరుగుతున్నందున ఆమె బయట ఉండే సాక్ష్యాలను తప్పుదోవపెట్టే అవకాశం ఉంటుందని ఈడీ కస్టడీని పొడిగించాలని, బెయిల్ ఇవొద్దంటూ పిటిషన్లు వేస్తూ వచ్చింది. ఈ క్రమంలో న్యాయస్థానం కూడా ఈడీ అధికారుల వాదనలతో ఏకీభవిస్తూ కస్టడీని కూడా పొడిగిస్తూ వస్తుంది. ఈ కేసులో డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​కు ఇటీవలే సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌​ ఇచ్చింది.