భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన జీఎస్ఎల్వీ ఎఫ్ 14 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ రెండో నెంబర్ లాంచ్ప్యాడ్ నుంచి సాయంత్రం 5.35 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం కోసం శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభమైంది.
కౌంట్డౌన్ 27.30 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగింది. . 2,275 కిలోల బరువు గల ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని 19 నిమిషాలలోనే ఈ వాహననౌక నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాన్ని వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు.
తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం కక్ష్యలోని ఇన్సాట్-3డీ, ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహాలతో కలిసి ఇది పనిచేయనుంది. జీఎస్ఎల్వీ సిరీస్లో ఇది 16వ ప్రయోగం. పూర్తి స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ తో ఈ రాకెట్ ను రూపొందించారు. భారత్ బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించేటప్పుడు జీఎస్ఎల్వి రాకెట్లు అవసరమయ్యాయి.
ఈ తరహా ప్రయోగాలకు ఎన్నో అవరోధాలు ఏర్పడినప్పటికీ ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ జీఎస్ఎల్వి రాకెట్లను ఇస్రో పూర్తి స్థాయిలో నిర్మిస్తోంది. ఈ ప్రయోగం కూడా విజయవంతం కావడంతో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ లో పాల్గొన్న శాస్ర్తవేత్తలను, సిబ్బందిని ఆయన అభినందించారు. అనుకున్న విధంగానే ఇన్శాట్ 3డీఎస్ ఉపగ్రహాన్ని జీఎల్ఎల్వీ-ఎఫ్14 విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిందని వెల్లడించారు.
ఇన్శాట్ ప్రయోగం విజయవంతమైందని చెప్పేందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. నిర్దేశించి విధంగానే రాకెట్ కక్ష్యలో ప్రవేశించిందని ప్రక్రియ అంతా సాఫీగా సాగిందని చెప్పారు. ఇన్శాట్ 3డీఎస్తో ఖచ్చితమైన సమాచారం అందుతుందని తెలిపారు. భూ, సముద్ర వాతావరణంపై ఖచ్చితత్వంతో సమాచారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ప్రయోగం విజయవంతంగా నిర్వహించిన ఇస్రో బృందానికి కేంద్రమంత్రి డా. జితేంద్రసింగ్ అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో అనేక విజయాలు సాధిస్తున్నామని చెబుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో ఇస్రో వరుస విజయాలు సాధిస్తుందని పేర్కొన్నారు.
More Stories
కె వి రావుకు సి పోర్టు షేర్లు తిరిగి ఇచ్చేసిన అరబిందో!
అయోధ్య రామయ్యకు టిటిడి పట్టువస్త్రాలు
గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి