రంజీల్లో ఆడకుంటే తీవ్ర పరిణామాలు

రంజీల్లో ఆడకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని బీసీసీఐ హెచ్చరించింది. జాతీయ జట్టు సభ్యులు, గాయాల బారిన ఆటగాళ్లు మినహా అందరూ రంజీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘‘జాతీయ జట్టుకు సెలక్ట్‌ కానివారు ఫిట్‌గా ఉంటే రంజీల్లో తమ రాష్ట్రాల జట్లకు ఆడాలి. ఫిట్‌నెస్‌కు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే జాతీయ క్రికెట్‌ అకాడమీని సంప్రదించాలి” అని సూచించింది. 

రాబోయే కొన్ని రోజుల్లో ఈ నిబంధనను బీసీసీఐ ఆటగాళ్లకు చెప్పనుంది. కేవలం ఎన్‌సీఏ మినహాయింపు ఇచ్చిన ప్లేయర్లు మాత్రమే రంజీల్లో ఆడకుండా ఉండే అవకాశం ఉంది. కొందరు జనవరి నుంచి వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ కోసం ప్రాక్టీస్‌ చేస్తున్నవారిని ఉద్దేశించే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని బీసీసీఐ అధికారిక వర్గాలు తెలిపాయి.  

బీసీసీఐ పిలుపును ఖాతరు చేయని వాళ్లకు త్వరలో నోటీసులు అందుతాయని సమాచారం. నోటీసులు అందుకున్న ఆటగాళ్లపై తీవ్ర చర్యలు ఉంటాయని తెలుస్తుంది. ఇషాన్‌ కిషన్‌ ఎపిసోడ్‌ నేపథ్యంలో బీసీసీఐ సీరియస్‌గా ఉందని తెలుస్తుంది. 

గత కొద్దికాలంగా జాతీయ జట్టులో లేని ఇషాన్‌ కిషన్‌ దేశవాళి టీమ్‌కు అందుబాటులో ఉండకుండా ఐపీఎల్‌ 2024 సన్నాహకాల్లో బిజీగా ఉన్నాడు. బరోడాలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్‌ క్యాంప్‌లో ఇషాన్‌ హార్దిక్‌ పాండ్యా, కనాల్‌ పాండ్యాలతో కలిసి ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. 

జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళి క్రికెట్‌ ఆడాలని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చేసిన సూచనలను సైతం ఇషాన్‌ లెక్క చేయకుండా ఐపీఎల్‌ కోసం ప్రిపేర్‌ అవుతున్నాడు. ఇషాన్‌ చర్యల పట్ల బోర్డు చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తుంది.