ఆప్ మంత్రి ఆతిశీకి ఢిల్లీ పోలీస్‌ల నోటీస్‌లు

ఏడుగురు ఆప్ ఎమ్‌ఎల్‌ఎల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించిన నేపథ్యంలో మంత్రి ఆతిశీకి ఢిల్లీ పోలీస్‌లు ఆదివారం నోటీస్‌లు జారీ చేశారు. క్రైమ్ బ్రాంచ్ బృందం ఆప్ మంత్రి ఆతిశీ ఇంటికి ఆదివారం ఉదయం మొదటిసారి వెళ్లినప్పడు ఆమె లేరని సీనియర్ పోలీస్ ఆఫీసర్ (క్రైమ్ బ్రాంచ్) తెలిపారు.  దాంతో రెండోసారి వెళ్లి మధ్యాహ్నం 12.55 కు మంత్రి కార్యాలయ సిబ్బందికి అందజేశారు.

ఈ ఆరోపణలకు సంబంధించి తగిన సమాచారం అందజేయాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను, మంత్రి ఆతిశీని క్రైమ్ బ్రాంచి సిబ్బంది కోరారు.  ఈనెల 5 వ తేదీ లోగా ఈ నోటీస్‌లకు స్పందించాలని సూచించారు. అంతకు ముందు రోజు క్రైమ్ బ్రాంచ్ పోలీస్‌లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఇదే విధంగా నోటీస్‌లు జారీ చేసి మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కోరారు.

బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపిన ఏడుగురు ఆప్ శాసనసభ్యుల పేర్లను ఇవ్వాల్సిందిగా కోరారు.  ఈ నోటీస్‌లకు ఆప్ నేత జాస్మిన్‌షా స్పందిస్తూ ఈ నోటీస్ సమన్ కానీ లేదా ఎఫ్‌ఐఆర్ కానీ లేదా ఐపిసి, సిఆర్‌పిసి సెక్షన్లు కానీ కావని పేర్కొన్నారు. ఇది కేవలం తెల్లకాగితంపై అక్షరాలు మాత్రమేనని తెలిపారు. “ఢిల్లీ మంత్రి ఇంటికి క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఆదివారం వెళ్లారు. అధికార సిబ్బందికి కాకుండా ప్రత్యక్షంగా ఆమెకే నోటీస్‌లు అందజేయాలనుకున్నారు. అయితే ఢిల్లీ మంత్రులు జారీ అయిన ప్రతీదాన్ని అందుకోడానికి ఎప్పుడూ ఇంటివద్దనే ఉంటారా? ”అని షా ప్రశ్నించారు.

సిఎంఒకు చెందిన ఒక అధికారికి నోటీస్ ఇచ్చేముందు పోలీస్ అధికారులు దాదాపు ఐదు గంటల సేపు వేచి ఉన్నారని షా చెప్పారు. ఆప్ ఎమ్‌ఎల్‌ఎలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని జనవరి 27న కేజ్రీవాల్ ఆరోపించారు. ఒక్కో సభ్యుడికి రూ.25 కోట్లు ఇవ్వజూపినట్టు ఆరోపించారు.