ఎయిర్ ఇండియా సహా మూడు సంస్థలపై సీబీఐ ఛార్జిషీటు

ఎయిర్ ఇండియా మాజీ ఎండీ అరవింద్ జాదవ్‌తోపాటు ఎస్ఏపీ ఇండియా, ఐబీఎంలపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. 2011లో సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసినప్పుడు రూ.225 కోట్ల విలువైన సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయడంలో అవకతవకలు జరిగాయని గుర్తించిన సివిల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఈ అంశాన్ని సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేసింది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ ఆరేండ్ల పాటు సుదీర్ఘ విచారణ తర్వాత తాజాగా చార్జీషీట్ దాఖలు చేసింది. ఐపీసీలోని 120, అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని రూల్స్‌కు అనుగుణంగా చార్జీషీట్ నమోదు చేసింది.  సరైన టెండర్ ప్రక్రియ నిర్వహించకుండానే ఎస్ఏపీ ఏజీ నుంచి ఈఆర్పీ అనే సాఫ్ట్‌వేర్‌ను ఎయిర్ ఇండియా ఎంపిక చేసింది. 
 
సంబంధిత పౌర విమానయాన శాఖ అనుమతి కూడా తీసుకోకుండానే సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2009, 2010ల్లో కార్యదర్శులు, మంత్రుల బృందాలకు ఈ విషయమై ప్రెజెంటేషన్ ఇచ్చామని ఎయిర్ ఇండియా తెలిపింది.ఇదిలా ఉంటే గతంలో ఒరాకిల్ నుంచి తీసుకున్న ఈఆర్పీ సాఫ్ట్‌వేర్ ఉండగా, కొత్త సాఫ్ట్‌వేర్ ఎందుకు తీసుకున్నారన్న విషయమై క్లారిటీ లేదు. దానిని సరి చేసేందుకు ప్రయత్నించినట్లు ఆధారాలు కనిపించడం లేదని సమాచారం. ఓపెన్ టెండర్ ప్రక్రియ చేపట్టకుండానే ఎస్ఏపీ, ఐబీఎంలకు నామినేషన్ పద్దతిలో ఈ కాంట్రాక్టును ఎయిర్ ఇండియా అప్పగించిందన్న ఆరోపణలు ఉన్నాయి.