ఆర్‌బీఐ ఆంక్షలతో పేటీఎం కుప్పకూలుతుందా!

బ్యాంకింగ్ సేవలు నిలిపివేయాలని, ఎలాంటి డిపాజిట్లు సేకరించవద్దని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించడంతో దాని ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది. ఆర్బీఐ పలు ఆంక్షలు విధించడంతో పేటీఎం షేర్లు కుప్పకూలుతున్నాయి. దానితో దాని భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.

 ఫిబ్రవరి 29, 2024 తర్వాత ఎలాంటి డిపాజిట్లు స్వీకరించకూడదు. వినియోగదారుల ఖాతాలు, ప్రీ పెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్స్, వాలెట్లు, ఫాస్టాగులు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డుల వంటి వాటిల్లో క్రెడిట్ ట్రాన్సాక్షన్లు, టాప్ అప్స్ చేయకూడదు. ఈ బ్యాంకు కార్యకలాపాలపై బయటి ఆడిటర్లు పూర్తి స్థాయిలో ఆడిట్ చేసి ఇచ్చిన నివేదిక ప్రకారమే చర్యలు తీసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.
 
ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం షేరు గత రెండు ట్రేడింగ్ సెషన్లలో 40 శాతానికి పైగా నష్టపోయింది. శుక్రవారం రోజున చివరకు రూ.487.05 వద్ద స్థిరపడింది. ఈ రెండు రోజుల్లో కంపెనీ మార్కెట్ విలువ రూ. 17.37 వేల కోట్లు కోల్పోయింది.  2021లో పేటీఎం పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. రూ.2150 ఇష్యూ ధరతో రూ.18,300 కోట్లు సమీకరించింది. నవంబర్ 18వ తేదీన రూ.1950 వద్ద ఎన్ఎస్ఈలో లిస్టింగ్ అయింది. అదే రోజు రూ.1560 కి పడిపోయింది. ఇప్పటి వరకు చూసుకుంటే ఈ కంపెనీ షేరు ఏకంగా 77 శాతం మేర పడిపోవడం గమనార్హం.
 
అయితే తమ బ్యాంకులు డిపాజిటుదార్ల డబ్బుకు ఎటువంటి ప్రమాదం లేదని, వారి నగదు తమ వద్ద క్షేమంగా ఉందని బ్యాంకు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కొత్తగా డిపాజిట్లు తీసుకోవద్దని మాత్రమే ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది గాని, ప్రస్తుతం ఉన్న డిపాజిట్లను ఉపసంహరించుకునేందుకు ఎటువంటి ఆంక్షలు లేవని భరోసా ఇచ్చింది.
 
పేమెంట్స్ బ్యాంక్ కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని, పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని ఆడిట్ లో తెలినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. దీంతో మరింతగా పర్యవేక్షణ చర్యలు చేపట్టాల్సి వస్తోందని ఆర్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐ ఆంక్షలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ నగదు లావాదేవీలు, మనీ లాండరింగ్ ఆరోపణలు, కేవైసీ ఉల్లంఘనలు ఇంధుకు కారణంగా తెలుస్తోంది. 
 
ఎటువంటి ధ్రువీకరణ లేకుండానే అకౌంట్లు తెరవడం, ఆయా ఖాతాల కేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదని సమాచారం. పేటీఎం వ్యాలెట్, పేమెంట్స్ బ్యాంక్ మధ్య కోట్లాది రూపాయలకు సంబంధించి మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు సమచారం. ఈ అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ సైతం కలుగజేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది
 
పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించి కేవైసీ పూర్తి చేయని లక్షలాది అకౌంట్లను గుర్తించినట్లు తెలుస్తోంది. ఒకే పాన్ కార్డుతో 1000 కిపైగా అకౌంట్లు తెరిచిన ఉదంతాలు వెలుగు చూశాయని సమాచారం. అలాగే కేవైసీ పూర్తి చేసిన ఖాతాల్లో నిర్దేశించిన గరిష్ఠ పరిమితిని మించి లావాదేవీలు జరిగినట్లు ఆడిట్ సంస్థలు గుర్తించాయని చెబుతున్నారు. 
 
పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు 35 కోట్లు ఇ-వాలెట్లు ఉన్నాయి. అందులో 31 కోట్ల ఖాతాలు ఇనాక్టివ్ గా ఉన్నాయి. మిలిగిన 4 కోట్లు అకౌంట్లు సైతం జీరో బ్యాలెన్స్ లేదా కొద్ది మొత్తం బ్యాలెన్స్ కలిగి ఉన్నాయి. ఇనాక్టివ్ గా ఉన్న ఖాతాలను మనీ లాండరింగ్ కోసం ఉపయోగించే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దానితో పేటీఎం వినియోదారులు జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది పేటీఎం ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టారు. స్టాక్ మార్కెట్ లో కూడా పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళన చెందుతున్నారు.